Chandrababu Health : చంద్రబాబు హెల్త్ తాజా అప్ డేట్ ఇదే- డాక్టర్ల క్లారిటీ..
ఏపీ స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితిపై ఇవాళ మరోసారి డాక్టర్లు, జైళ్లశాఖ అధికారులు అప్ డేట్ ఇచ్చారు. రాజమండ్రి జైల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో అధికారులు చంద్రబాబు తాజా ఆరోగ్య పరిస్ధితిని వెల్లడించారు. అంతే కాదు ఈ నివేదికను కోర్టులో సమర్పించనున్నట్లు కూడా వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు రోజుకో విమర్శ చేస్తున్న నేపథ్యంలో డాక్టర్ల అప్ డేట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితిపై మాట్లాడిన డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. చంద్రబాబు వాడే మందులు చూశాకే మిగతా మందులు సూచించినట్లు తెలిపారు. చంద్రబాబును చల్లటి ప్రదేశంలో ఉంచాలని జైలు అధికారులకు చెప్పినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఆయనకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదన్నారు. అనంతరం జైళ్ళశాఖ డీఐజీ రవికిరణ్ కూడా డాక్టర్ల నివేదికపై మాట్లాడారు.
చంద్రబాబు చల్లని వాతావరణం లో ఉండాలని డాక్టర్లు చేసిన సూచన తాము పాటిస్తామన్నారు . చంద్రబాబు పర్సనల్ డాక్టరు సలహాతో ఆయన మందులు వాడుతున్నారని తెలిపారు. అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డాక్టర్లు రోజుకు మూడు సార్లు టెస్ట్ నిర్వహించడంతో పాటు చంద్రబాబు ఆహారం విషయంలో కూడా సూచనలు చేశారని రవికిరణ్ తెలిపారు. చంద్రబాబును ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదని డీఐజీ తెలిపారు. చంద్రబాబు జైల్లో అత్యంత సురక్షితంగా ఉన్నారన్నారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్దితిపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని, గవర్నర్ వంటి వారికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జైళ్ళశాఖ అధికారులు, డాక్టర్లు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications