తిరుమలలో సెప్టెంబర్ నెల పొడవునా.. కోలాహలం
కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం సెప్టెంబర్ లో పండగల శోభతో విలసిల్లబోతోంది. కోట్లాదిమంది భక్తుల ఆరాధ్యదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువుదీరిన ఈ పవిత్ర గిరులపై ఈ నెలలోనే వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పలు ముఖ్యమైన పండుగలు, విశేష ఉత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నెల తొలి వారం నుంచే తిరుమల కొండపై పండుగల కోలాహలం ప్రారంభం కానుంది. 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో ఇవి మొదలవుతాయి. 5వ తేదీన ఉట్లోత్సవంతో తిరుమల సందడిగా మారనుంది. 13వ తేదీన బలరామ జయంతి, వరాహ జయంతి విశేష పర్వదినాలు జరుగుతాయి. ఈ సందర్భంగా తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది టీటీడీ. ఆ మరుసటి రోజే అంటే.. 14న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరుగుతుంది.

15న సాయంత్రం వేళ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి. ఇందులో అత్యంత విశిష్టమైనదిగా, కోట్లాది మంది ఆరాధించేదిగా భావించే శ్రీవారి గరుడ సేవ 19వ తేదీన ఉంటుంది. 20న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 22న రథోత్సవం నయనానందకరంగా నిర్వహించనుంది టీటీడీ. 23న జరిగే పవిత్ర చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
దీని తర్వాత కూడా శ్రీవారి ఆలయంలో పలు విశేష పూజలు శాస్త్రోక్తంగా సాగుతాయి. 24న బాగ్ సవారీ, 25న అనంత పద్మనాభ వ్రతం ఉంటాయి. ఇటువంటి విశేష సందర్భాల్లో శ్రీవారిని కనులారా వీక్షించడం పూర్వ జన్మ సుకృతంగా భక్తులు విశ్వసిస్తారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు బ్రహ్మోత్సవాల సమయంలో కొన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసే అవకాశం ఉంది.
తిరుమలలో రోజువారీ రద్దీ కొనసాగుతోంది. సోమవారం 77,042 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. వారిలో 36,698 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.14 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 27 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుంచి 12 గంటల సమయం పట్టింది. 4.14 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.09 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.














Click it and Unblock the Notifications