మూగ యువతిపై రేప్: కూతురు వరుస బాలికపై పలుమార్లు రేప్
అనంతపురం: మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. కామాంధుల అకృత్యాలకు అంతు లేకుండా ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామంలో మూగ యువతి(19)పై అదే గ్రామానికి చెందిన అశోక్(32) అత్యాచారం జరిపాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది.
అశోక్ తమ కూతురును బెదిరించి గత కొంతకాలంగా అత్యాచారం జరిపినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జయనాయక్ తెలిపారు.
ఇదిలావుంటే, కూతురు వరసైన బాలిక(12)పై ఓ కీచకుడు పలుమార్లు అత్యాచారం జరిపాడు. దీంతో గర్భం దాల్చిన బాలికకు తల్లిదండ్రులు అబార్షన్ చేయించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలో జరిగింది. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
నంబులపూలకుంట మండలం గౌకనపల్లి పంచాయతీ గడ్డమోళ్ళపల్లి గ్రామానికి చెందిన బాలిక(12) స్థానిక పాఠశాలలో ఆరోతరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పెదనాన్న వరసయ్యే రాజు(45) బాలికకు మాయమాటలు చెప్పి పలుసార్లు అత్యాచారం జరిపాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది.
విషయం ఇంట్లోవారికి చెబితే చంపుతానని రాజు బెదిరించాడు. అయితే మూడు రోజుల క్రితం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను విచారించగా జరిగింది చెప్పింది. దీంతో వారు గుట్టుచప్పుడుకాకుండా కడప జిల్లా పులివెందుల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాలికకు అబార్షన్ చేయించారు. బాలిక తల్లిదండ్రులు రాజుపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.