మే 10న ఎంసెట్, 16న ఐసెట్: తామే నిర్వహించుకుంటామన్న పాపిరెడ్డి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ఉన్న విద్యామండలి ప్రకటించింది. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి పరీక్షల తేదీలను ప్రకటించారు.
మే 10న ఎంసెట్, మే 14న ఈసెట్, మే 16న ఐసెట్, మే 28న ఎడ్ సెట్, మే30న లాసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి పరీక్షలు, ప్రవేశ ప్రక్రియ నిర్వహించే అధికారం ఉన్నత విద్యామండలికే ఉందని స్పష్టం చేశారు.
మా ఎంసెట్ మేమే నిర్వహించుకుంటాం: పాపిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. ఆంధ్ర ఉన్నత విద్యామండలి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని అన్నారు.
తెలంగాణ విద్యార్థులకు ఎంసెట్ తామే నిర్వహించుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. విభజన చట్టం ప్రకారమే ఎంసెట్ నిర్వహిస్తామని తెలిపారు. ఎంసెట్కు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతకం చేశారని, తర్వలోనే అన్ని యూనివర్సిటీల వీసీలతో సమావేశం నిర్వహించి పరీక్ష తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.