మొంథా తుపాన్ ఆలస్యం..! ఏపీలో రద్దు చేసిన 14 రైళ్ల పునరుద్దరణ..!
ఏపీలో మొంథా తుపాను ప్రభావం మొదలైంది. అయితే బంగాళాఖాతంలో తుపాను మాత్రం తీరంవైపు నెమ్మదిగా కదులుతోంది. దీంతో ఈ తుపాను ఎల్లుండికి కాకినాడ వద్ద తీరం దాటడంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే రద్దు చేసిన 50కి పైగా రైళ్లలో 14 రైళ్లను పునరుద్దరిస్తూ తూర్పు కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా రైళ్లలో ప్రయాణించే వారు ఈ విషయం గమనించాల్సి ఉంటుంది.
తూర్పు కోస్తా రైల్వే ముందుగా రద్దు చేసి ఇప్పుడు పునరుద్ధరించిన 14 రైళ్లలో ఇవాళ బయలుదేరాల్సిన విశాఖ-తిరుపతి స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 08583, అలాగే విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్ రైలు నంబర్ 22707, గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17243, రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17244, విశాఖ-మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17220 విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12727, విశాఖ-మహబూబ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12861 ఉన్నాయి.

అలాగే విశాఖ-చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 22869, విశాఖ-సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12739, విశాఖ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 20805, ఎల్లుండి బయలుదేరాల్సిన న్యూఢిల్లీ-విశాఖపట్నం రైలు నంబర్ 20806, ఇవాళ బయలుదేరాల్సిన విశాఖ-తిరుపతి డబుల్ డెకర్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 22707, విశాఖ-ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 18519,ఎల్లుండి బయలుదేరాల్సిన ఎల్టీటీ-విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 18520ను పునరుద్ధరించారు. ఈ రైళ్లన్నీ యథావిథిగా నడుస్తాయని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ రైళ్ల రన్నింగ్ స్టేటస్ ను వెబ్ సైట్ లో చూసుకోవాలని కోరింది.
మరోవైపు మొంథా తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం హైఅలర్ట్ ప్రకటించారు. ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. తగు చర్యలు తీసుకోవాలని ఆపరేషన్, ఎలక్ట్రికల్ అధికారులకు జీఎం ఆదేశాలిచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటుకు ఆదేశించారు.

నిరంతరం అందుబాటులో ఉండి ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రైలు వంతెనల స్థితి, నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశాలిచ్చారు. ట్రాక్లు, బ్రిడ్జిలపై నిరంతరం పెట్రోలింగ్ బృందాలు పర్యవేక్షణ చేయాలని జీఎం ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చేరుకునేందుకు సర్వం సిద్ధం చేయాలని జీఎం సూచించారు. డీజిల్ లోకోమోటివ్లు, మొబైల్ రెస్క్యూ టీమ్లను నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశాలిచ్చారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎప్పటికప్పుడు రైళ్ల రాకపోకలపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అలాగే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications