మీరిప్పుడు నన్ను కెమెరాతో కొడితే ఏం చేస్తా: తుని ఘటనపై ఎస్పీ
రాజమండ్రి/విజయవాడ: అయిదు రోజుల క్రితం కాపు గర్జన నేపథ్యంలో తునిలో జరిగిన విధ్వంసంపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ స్పందించారు. తుని ఘటనలో పోలీసుల వైఫల్యం అంటూ వస్తున్న వార్తలపై ఆయన మాట్లాడారు.
విధ్వంసాన్ని ముందే గుర్తించడంలో ఇంటెలిజెన్స్ విఫలమైందని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన మాట్లాడుతూ.. తాము అన్ని రకాలుగా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. నిఘా వైఫల్యం లేదన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'మీరు ఇక్కడ కూర్చున్నారు. నన్ను కెమెరాతో కొట్టొచ్చు. మీరు కొడతారని నేను ముందుగా భావించలేని కదా. అక్కడ అదే జరిగింది. లక్షా, లక్షన్నర మంది ఒకచోట చేరారు. వారంతా ఎటువైపు కదులుతారన్నది ఎవరూ ఊహించలేర'ని చెప్పారు.
ఇంటిలిజెన్స్ వైఫల్యం లేదని చెప్పారు. ఎవరో కొంతమంది హఠాత్తుగా విధ్వంసం సృష్టిస్తే ఎవరూ ఏం చేయలేరని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఎస్పీ కూడా అదే చెప్పారు.
ఎస్పీ రవిప్రకాశ్ ఇంకా మాట్లాడుతూ... కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో రేపు తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రావొద్దని సూచించారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా యువత ఇక్కడకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు.
వారిని అడ్డుకునేందుకు జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. వాహనాల తనిఖీ కోసం 35 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా పది కంపెనీల ప్రత్యేక బలగాలు, నాలుగు కంపెనీల ర్యాపిడ్ ఫోర్స్తో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు.
శాంతియుతంగా ఆందోళన చేసేవారిని పోలీసులు ఏమీ చేయరన్నారు. ఆందోళన పేరుతో విధ్వంసాలకు పాల్పడితే మాత్రం ఊరుకోమన్నారు. తుని ఘటనపై పారదర్శకంగా కేసులు నమోదు చేస్తున్నామని, పోలీసుల విచారణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.