కెసిఆర్తో రామోజీ రావు భేటీ: క్యాజువల్ విజిట్ అని వ్యాఖ్య, ఓంసిటీ కోసమని సిఎంవో
హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తెలంగాణ సచివాలయంలో అడుగు పెట్టారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిసేందుకు ఆయన వచ్చారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో గంటకు పైగా ఆయన కెసిఆర్తో భేటీ అయ్యారు. సీఎంను కలిసేందుకు వెళ్లే సమయంలోనూ, తర్వాత తిరిగి వెళ్లేటప్పుడూ.. ‘ఓం సిటీ విషయమై మాట్లాడేందుకే వచ్చారా?' అని మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించినప్పటికీ ‘చాలా క్యాజువల్ విజిట్' అని మాత్రమే రామోజీ రావు చెప్పారు. అంతకు మించి మాట్లాడలేదు.
అయితే, రామోజీ ఫిలిం సిటీలో కొత్తగా నిర్మిస్తున్న ఓం సిటీ విషయమై ఇరువురి మధ్య భేటీ జరిగినట్లుగా చెబుతూ సీఎం కార్యాలయం అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. పలు వ్యాపారాలు చేస్తూ, దశాబ్దాలుగా పత్రికారంగాన్ని నిర్వహిస్తూ వస్తున్న రామోజీరావు ఎప్పుడు కూడా సచివాలయంలో కాలు పెట్టలేదు. దేశ ఉప ప్రధాని హోదాలో ఎల్కే అద్వానీ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కూడా రామోజీరావు ఆయన దగ్గరకు వెళ్లలేదు. అద్వానీయే వచ్చి రామోజీరావును ఆయన కార్యాలయంలో కలిశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన రాలేదు.

ఇప్పుడు మాత్రం ఓం సిటీ విశేషాలతో రూపొందించిన పుస్తకం (కాఫీ టేబుల్ బుక్) తొలి ప్రతిని అందించేందుకు సచివాలయానికి రావడం గంటకు పైగా కెసిఆర్తో భేటీ కావడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
రామోజీ ఫిలిం సిటీ వంటి అద్భుత నిర్మాణాన్ని అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక నగరం ఓం సిటీ నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘ఓం సిటీ' నిర్మాణం ఎటువంటి ఆటంకాలూ లేకుండా త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని రామోజీరావుకు హామీ ఇచ్చారు.
ఈ సిటీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. ఓం సిటీ నిర్మాణంతో అన్ని దేవాలయాలను ఒకే చోట దర్శించుకునేందుకు భక్తులకు వెసులుబాటు ఏర్పడుతుందని రామోజీరావు ముఖ్యమంత్రికి చెప్పారు. పూర్తిగా సౌర విద్యుత్తును వినియోగించుకునే ఈ సిటీలో.. థీమ్ పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
మ్యారేజి హాళ్లు, ఆడిటోరియంలు, భక్తి సంగీతాన్ని అందించే కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు వేదికలు, హెల్త్ సెంటర్, భక్తి సినిమాల ప్రదర్శనకు ప్రత్యేక థియేటర్లు, హోమాల నిర్వహణకు కుండాలు. పుణ్యస్నానాలు చేసేందుకు పుష్కరిణులు, ప్రపంచంలోనే అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం వంటివాటిని ఓం సిటీలో నిర్మించనున్నట్లు రామోజీరావు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, రెవిన్యూ కార్యదర్శి మీనా, రామోజీ ఫిలిం సిటీ సీఈవో రాజీవ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications