Rajya Sabha ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది: రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్..!
అమరావతి: త్వరలో రాజ్యసభ ఎన్నికల నగారా మోగబోతోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోన్న ప్రస్తుత తరుణంలో రాజ్యసభ పోలింగ్ కూడా దీనికి జత కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు పోలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను మంగళవారం ఉదయం విడుదల చేశారు.
Recommended Video


ఏపీలో 4, తెలంగాణలో 2
ఏపీలో నాలుగు, తెలంగాణ రెండు రాజ్యసభ స్థానాలు ఏకకాలంలో ఖాళీ కానున్నాయి. కేంద్ర మాజీమంత్రి టీ సుబ్బరామి రెడ్డి (కాంగ్రెస్), తోట సీతా రామలక్ష్మి (తెలుగుదేశం), కే కేశవరావు (తెలంగాణ రాష్ట్ర సమితి) మహ్మద్ అలీఖాన్ పదవీ కాలం ముగియబోతోంది. ఏప్రిల్ 9వ తేదీన వారి పదవీ కాలం ముగుస్తుంది. ఈ నలుగురిలో కే కేశవరావు, మహ్మద్ అలీఖాన్ ఇద్దరూ తెలంగాణకు చెందిన నాయకులు. తెలంగాణ నుంచి కేవీపీ రామచంద్ర రావు (కాంగ్రెస్), గరికపాటి మోహన రావు (తెలుగుదేశం) పదవీ విరమణ చేయనున్నారు.

లాబీయింగ్ షురూ..
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకేసారి మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనితో ఆశావహులు తమ లాబీయింగ్ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అందరి కళ్లూ ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లబోయే అభ్యర్థుల మీదే నిలిచింది. ఏపీ నుంచి ఖాళీ కాబోయే నాలుగు స్థానాలన్నీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే వెళ్తాయి. తెలుగుదేశం పార్టీకి గానీ, కాంగ్రెస్కు గానీ.. తమ అభ్యర్థులను రాజ్యసభకు పంపించడానికి అవసరమైన బలం లేదు.

మోహన్బాబు, చిరంజీవిల మీదే దృష్టి అంతా..
ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థుల జాబితాలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. కలెక్షన్ కింగ్ మోహన్బాబు, మెగాస్టార్ చిరంజీవిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఇదివరకే వార్తలు వెలువడ్డాయి. మోహన్బాబు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన విస్తృతంగా పర్యటించారు కూడా. కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో అదే సామాజిక వర్గానికి చెందిన మోహన్ బాబు, ఆయన తనయుడు హీరో మంచు విష్ణు వైసీపీ తరఫున ప్రచారం చేశారు.

వైసీపీతో రీ ఎంట్రీ..
పెద్దల సభకు పంపిస్తామనే హామీతోనే ఆయనే వైసీపీలో చేరినట్లు చెబుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ తరఫున మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అనంతరం ఆయన రాజకీయాలకు గుడ్బై చెప్పారు. ఇన్నేళ్ల తరువాత వైసీపీతో ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మరోసారి రాజ్యసభలో అడుగు పెట్టాలని ఆశిస్తున్నారు.

పవన్ కల్యాణ్కు చెక్ చెప్పడానికి చిరంజీవి..
కాపు సామాజిక వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు ఇదివరకు వెలువడ్డాయి. రాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా ఉంటోన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు చెక్ చెప్పడానికి ఆయన సోదరుడు చిరంజీవిని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపించాలనే వ్యూహాన్ని అనుసరించాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. వారిద్దరి పేర్లూ దాదాపు ఖాయం కావచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications