నిమ్మగడ్డ పిటీషన్ హైకోర్టులో: ఓటర్ల తుది జాబితా ఇదే: మహిళా ఓటుబ్యాంకు స్ట్రాంగ్: ప్రభుత్వ వ్యతిరేకత?
అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్పై నెలకొన్న వివాదాలు కొనసాగుతున్న వేళ.. దీని నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన మోషన్ పిటీషన్ 18వ తేదీన విచారణకు రానున్న సందర్భంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటర్ల తుది జాబితా వెలువడింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లను గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే ఈ జాబితాను ప్రకటించింది. శుక్రవారం వరకు నమోదైన ఓటర్లను ఈ జాబితాలో చేర్చారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కే విజయానంద్ దీన్ని విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం.. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 4,04,41,378. ఇందులో 1,99,66,737 పురుష ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 2,04,71,506గా నమోదైంది. 66,844 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లను కూడా జాబితాలో తీసుకొచ్చారు. 4,135 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

గత ఏడాది ఎన్నికల ముగిసినప్పటి నుంచీ.. తాజాగా తుది జాబితాను ప్రకటించే సమయానికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది కాలంలో కొత్తగా 4,25,860 మంది తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకున్నట్టయింది. రికార్డు స్థాయిలో కొత్త ఓటర్ల సంఖ్య పెరిగిందని, ఎన్నికల పట్ల ప్రజల్లో నెలకొన్న చైతన్యానికి దీన్ని నిదర్శనంగా భావించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఇకముందు ఎలాంటి ఎన్నికలను నిర్వహించినప్పటికీ.. పోలింగ్ శాతం భారీగా పెరగడానికి కొత్త ఓటర్ల సంఖ్య కారణమౌతుందని అంటున్నారు. దీనిపై ఒక్కో పార్టీ ఒక్కో రకంగా స్పందిస్తోంది. తాము అమలు చేస్తోన్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, పార్టీని గెలిపించడానికి ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతుండగా.. తెలుగుదేశం, ఇతర పక్షాలు దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నాయి.












Click it and Unblock the Notifications