ఏపీలో 4.04 కోట్ల మంది..తెలంగాణలో 3.08 కోట్ల ఓటర్లు : రెండు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా విడుదల..!!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలతో చీఫ్ ఎలక్టోరల్ అధికారి శశాంక్ గోయల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చ జరిగింది. అనంతరం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. నవంబర్ 1, 2021న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో 3,08,75,744 మంది ఓటర్లున్నారు.
ఈ జాబితాలో పురుషులు 1,52,57,690 మంది, మహిళలు 1,50,97,292 మంది, థర్డ్ జెండర్ 1,683 మంది, సర్వీస్ ఓటర్లు 14,501 మంది, ఎన్నారై ఓటర్లు 2,742 మంది, పీడబ్ల్యూడీ ఓటర్లు 5,01,836 మంది ఉన్నారు. ఇక, ఏపీలో బద్వేలు నియోజకవర్గాన్ని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.2021 నవంబరు 1 తేదీనాటికి రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 4 లక్షల 23 వేల 407 గా నమోదు అయ్యాయి.

పురుష ఓటర్ల సంఖ్య 1 కోటీ 99 లక్షల 53 వేల 184గా పేర్కోన్న ఈసీ.. అదే సమయంలో మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 04 లక్షల 66,182 మందిగా నమోదు అయినట్లు వెల్లడించారు. ఏపీలో 4041 మంది ధర్డ్ జెండర్ ఓటర్లు ..67,090 మంది సర్వీసు ఓటర్లుగా నమోదు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 45, 678 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం గుర్తించింది. అత్యధికంగా..తూర్పుగోదావరి జిల్లాలో 43 లక్షల 31,945 మంది ఓటర్లు ఉండగా...విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18 లక్షల 94,362 మంది ఓటర్లు గా నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
మరోవైపు తెలంగాణ ఓటు హక్కు లేని వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీని కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఈనెల 6,7,27,28 తేదీల్లో ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. మరోవైపు సోమవారం నుంచి ఈనెల 30 వరకు ఓటర్ల అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. జనవరి 5, 2022న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొంది. కాగా ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 6న ప్రకటించనున్నారు.
ఈ జాబితాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను డిసెంబరు 6 వరకు స్వీకరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, రెండు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని హుజూరాబాద్... ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications