విత్తనాలు, ఎరువుల పంపిణీపై సీఎం కీలక ప్రకటన
రాష్ట్రంలో రైతులకు విత్తనాల సరఫరా మొదలుకొని పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు ప్రతి దశలోనూ పక్కా ప్రణాళికతో కూడిన నిర్దిష్ట కార్యాచరణను అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట వేసినప్పటి నుంచే రైతుల వివరాల నమోదు, పంటల రికార్డులు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి ప్రక్రియపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే సీజన్ నుంచి రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు సాఫీగా సాగేలా వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్, ప్లానింగ్ విభాగం కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ గ్రామాల్లో రైతుల వివరాల నమోదు, పంట ఉత్పత్తుల అంచనాలు, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పర్యవేక్షిస్తుంది. ఏ రైతు ఏ పంట వేశాడు, ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో పంటలు ఉన్నాయనే వివరాలను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా కచ్చితంగా నమోదు చేయాలని, అకాల వర్షాలు, తూకం, రవాణా, నిల్వ వంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు.

సన్న వడ్ల సాగుకు సబ్సిడీ విత్తనాలు.. రైతు వేదికల బలోపేతం
రాష్ట్రంలో సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ ఇస్తున్న నేపథ్యంలో, 7 రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల ద్వారా సబ్సిడీపై అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇకపై రైతు వేదికలను కేవలం భవనాలుగా కాకుండా, రైతులు తమ వివరాలను నమోదు చేసుకుని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే కార్యాచరణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలని, జిల్లాల్లో వీటి పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు.
సాంకేతికత వినియోగం.. యాప్ ద్వారా ఎరువుల బుకింగ్
వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను అధ్యయనం చేసి మరింత విస్తరించాలని సీఎం సూచించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని మొత్తం వ్యవస్థను సాంకేతికతతో అనుసంధానం చేయాలన్నారు. అలాగే ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం అన్ని రకాల ఫెర్టిలైజర్లను యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురావాలని, అలా బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఎరువుల కోటా కోసం కేంద్రంపై ఒత్తిడి.. ఢిల్లీకి మంత్రుల బృందం
రాబోయే ఖరీఫ్ సీజన్కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి వాస్తవాలను వివరించాలని, అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని స్పష్టం చేశారు.
మరోవైపు మార్క్ఫెడ్ నష్టాలను తగ్గించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల ఈసారి మొక్కజొన్న కొనుగోళ్లలో నష్టం తగ్గించగలిగామని, గతంలో టన్ను రూ.13 వేలు ఉంటే ఈసారి రూ.21 వేలకు పైగా టెండర్ రేట్ సాధించామని సీఎం వివరించారు. ఆయిల్ ఫెడ్, ప్రభుత్వ డైరీలను మరింత బలోపేతం చేసి లాభాల బాట పట్టించాలని, పాల రైతులకు సకాలంలో చెల్లింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.














Click it and Unblock the Notifications