బర్రెలక్కస్ఫూర్తితో రాజకీయాల్లోకి రండి-యూత్ కు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అర్ధరాత్రి పిలుపు..
తాజాగా తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యూత్ అంతా ఆమెకు అండగా నిలిచారు. కొల్లాపూర్ ఓటర్లను ఆ స్ధాయిలో ఆకట్టుకోలేక ఓటమిపాలైనా బర్రెలక్క పోటీ యూత్ కు ఇచ్చిన స్ఫూర్తి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా యూత్ ను బర్రెలక్క స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
ధన, కుల, వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి పలకాలని వీవీ లక్ష్మీనారాయణ నిన్న రాత్రి విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన అర్ధరాత్రి ఆలోచన కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ప్రజా సంఘాలు, రైతులు, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో ఆయన నిన్న రాత్రంతా చర్చలు జరిపారు. అర్థరాత్రి స్వాతంత్ర్యం వచ్చిన దేశంలో ప్రధాన సంఘటనలన్నీ అర్దరాత్రే జరిగాయని జేడీ గుర్తు చేశారు. అందుకే అర్ధరాత్రి మేల్కొని సమస్యలు తెలుసుకుంటున్నాని తెలిపారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు లేవని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అసహనం వ్యక్తం చేశారు. రాజనీతి శాస్త్రాన్ని రాజకీయ శాస్త్రంగా మార్చి ప్రస్తుత రాజకీయ నాయకులు కుటుంబ పాలనకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఓటర్లను చైతన్యపరిచి ప్రస్తుత రాజకీయాలను సంస్కరించాల్సిన తరుణం వచ్చిందన్నారు. పరిపాలన విభాగాల్లో పనిచేస్తున్న అధికారులందరూ అన్ని ఫైళ్లను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో పెట్టాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులైనప్పుడు పరిపాలనలో ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియాలని, అవినీతికి అవకాశం లేని ప్రభుత్వాల ఏర్పాటుకు చట్టాలు చేయాలన్నారు.
మేనిఫెస్టోలను ప్రజలే నేరుగా తయారుచేసి వాటిని అమలు చేయగలిగే నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని కోరారు. భారత రాజకీయ వ్యవస్థలో పలు రకాల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయం అంటే యువత అసహ్యించుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రాజకీయాలను బాగు చేయాలంటే రాజకీయాలలోకి దిగక తప్పదన్నారు. తెలంగాణలో కొల్లాపూర్ నియోజక వర్గంలో పోటీ చేసిన శిరీష అనే బర్రెలక్కకు అందుకే తాను మద్దతు పలికానని సీబీఐ మాజీ జేడీ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications