ఫోరంకు ఎర్రబెల్లి రాజీనామా: బాబుకు ఫ్యాక్స్, బుజ్జగింపు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ చేశారు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. పలువురు తెలంగాణ ప్రాంత నేతలు ఆయనను బుజ్జగిస్తున్నారు. రేవూరి ప్రకాశ్ రెడ్డి వంటి సీనియర్లు ఎర్రబెల్లిని బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎర్రబెల్లి అధిష్టానం పైన కొంతకాలంగా ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఓ ప్రత్యేక కమిటీ ఉండాలని ఆయన కొంతకాలంగా చంద్రబాబును కోరుతున్నారు. ప్రత్యేక కమిటీపై సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారని అంటున్నారు. ఇప్పుడు ఎర్రబెల్లి పార్టీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతుండటంతో చంద్రబాబు కమిటీ కోసం కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

కాగా, ఎర్రబెల్లి టిడిపిని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఈ రోజు తన నివాసంలో ముఖ్యులైన కార్యకర్తలను, తన అనుచరులతో సమావేశమై, ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎర్రబెల్లి దాదాపు టిడిపిని వీడటం ఖాయమని చెబుతున్నారు.
ఆయన కాంగ్రెసు పార్టీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం రెండుగంటలకు ఆయన తన వర్గం వారితో భేటీ కానున్నారు. ఈ భేటీలో కార్యకర్తలు, తన అనుచరుల అభిప్రాయాలను ఆయన తీసుకోనున్నారు. ఆ తర్వాత ప్రకటన చేయనున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ను ఎర్రబెల్లి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications