ఈ అన్యాయం ఎవరికీ జరగొద్దు: అనూహ్య తండ్రి, చంద్రభానుకు ఏ శిక్ష పడ్తుంది?
విజయవాడ: తన కుమార్తెకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగవద్దని ఎస్తేర్ అనూహ్య తండ్రి మంగళవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురును దారుణంగా హతమార్చిన నిందితుడు చంద్రభానుకు కఠిన శిక్ష పడాలని ఆయన అన్నారు.
అనూహ్య హత్య కేసులో నిందితుడైన ట్యాక్సీ డ్రైవర్ చంద్రభానును ముంబై కోర్టు మంగళవారం నాడు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనూహ్య తండ్రి ప్రసాద్ స్పందించారు. తనకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు.
కాగా, మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ టెక్కీ అనూహ్య అత్యాచారం, హత్యకు గురైంది. టిసిఎస్ కార్యాలయంలో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజినీర్గా పని చేసే అనూహ్య.. 2013 డిసెంబర్ నెలలో సొంతూరు మచిలీపట్నం వచ్చారు.
తిరిగి వెళ్తూ 2014 జనవరి 5న ముంబై రైల్వే స్టేషన్ వద్ద అదృశ్యమైంది. ఎల్టీటీ స్టేషన్లో రైలు దిగిన ఆమెకు ట్యాక్సీ డ్రైవర్ చంద్రభాన్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, హతమార్చాడు.
దాదాపు ఏడాదిన్నర నుంచి కేసు విచారణ సాగుతోంది. 1300 పేజీల ఛార్జీషీటు దాఖలు చేశారు. చివరకు నిందితుడు చంద్రభానును దోషిగా నిర్ధారించారు. బుధవారం శిక్షను ఖరారు చేస్తారు. అతడికి యావజ్జీవ శిక్ష విధించే అవకాశముందని అంటున్నారు.
అనూహ్య నుంచి దొంగిలించిన బ్యాగ్, దుస్తులు, ఐడి కార్డు తదితర వస్తువుల ఆచూకీని పోలీసులు గుర్తించారు. వాటిలో లభించిన డిఎన్ఏ నమూనాల ద్వారా నిందితుడిని గుర్తించారు. అనూహ్య మృతదేహం జనవరి 16, 2014న భాండూవ్లోని ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ వే సమీపంలో దొరికింది.