తిరుపతిలో నూతన శోభ.. ముస్తాబు అవుతోన్న ఆలయం: భక్తుల తాకిడి
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. బుధవారం నాడు 82,255 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,683 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.76 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.43 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.64 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,496 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కాగా.. తిరుపతిలో నూతన శోభను సంతరించుకోనుంది. ఇక్కడి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ నెల 26వ తేదీన ఆరంభం అయ్యే ఈ విశేష ఉత్సవాలు 28 వరకు కొనసాగనున్నాయి. దీనికి ఆరంభసూచికగా 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహించనున్నారు అర్చకులు. ఈ ఉత్సవాలకు సర్వదేవతలనూ ఆహ్వానించనున్నారు.
ఆలయ పవిత్రత పరిరక్షణ కోసం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏడాది పొడవునా ఇక్కడ జరిగే నిత్యార్చనలు, ఉత్సవాలు, కైంకర్యాల్లో తెలియక సంభవించిన దోషాలకు పరిహారంగా, ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు వీటిని చేపడుతుంటారు. దీనివల్ల ఆలయంలో ఆధ్యాత్మిక శోభ మరింత వృద్ధి చెందుతుంది. ఈ ఉత్సవాల సందర్భంగా వేలసంఖ్యలో భక్తులు కపిలతీర్థం ఆలయాన్ని సందర్శించే అవకాఁశం ఉండటంతో.. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోన్నారు అధికారులు
మొదటి రోజు 26న.. ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. రెండో రోజు.. ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాల పూజ, హోమం నిర్వహిస్తారు. చివరి రోజున.. ఉదయం మహాపూర్ణాహుతి, కలశోద్ధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు.
సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారు, శ్రీ చండికేశ్వరస్వామివారు ఆలయ పురవీధుల్లో భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో అలిపిరితో పాటు తిరుపతిలో పలు ప్రధాన కూడళ్లల్లో విద్యుద్దీపాలతో కపిలేశ్వర స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. కపిలతీర్థం ఆలయానికి వెళ్లే మార్గాన్ని అందంగా అలకంరించనున్నారు.












Click it and Unblock the Notifications