షాకింగ్: నకిలీ కరోనా పాజిటివ్ సర్టిఫికేట్ పోలీసులకు పంపిన అఖిలప్రియ భర్త, ఇది తమ్ముడి ప్లానే
హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ మరో కేసులో ఇరుక్కున్నాడు. హఫీజ్ పేట భూముల వ్యవహారంలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో భార్గవ్ రామ్ రెండోసారి పోలీసులకు చిక్కాడు. నకిలీ కరోనా పాజిటివ్ సర్టిఫికేట్ సమర్పించి న్యాయ విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నాడని అతనిపై బోయినపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.

కోర్టుకు హాజరయ్యేందుకు ఇష్టంలేక భార్గవ్ రామ్ ప్లాన్..
ప్రవీణ్ సోదరుల కిడ్నాప్ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ఇష్టం లేని భార్గవ్.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించాడు. మొదట నిజమేనని నమ్మిన పోలీసులు.. అనంతరం విచారణ చేపట్టి సాక్ష్యాధారాలను సేకరించారు. అది నకిలీ పాజిటివ్ రిపోర్టుగా తేల్చారు. నకిలీ ధృవపత్రాన్ని ఇచ్చిన గాయత్రి ల్యాబ్ లైసెన్స్ రద్దుచేయాలంటూ వైద్యారోగ్య శాఖకు లేఖ రాశారు.

రూ. 1200లకు ఫేక్ కరోనా పాజిటివ్ సర్టిఫికేట్.. ఇలా దొరికాడు..
కాగా, కోర్టు విచారణకు హాజరుకాలేనంటూ భార్గవరామ్ గత శనివారం బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్కు కరోనా పాజిటివ్ రిపోర్టును వాట్సాప్లో పంపించాడు. కోర్టులో ఈ విషయాన్ని తెలిపేందుకు ఇన్స్పెక్టర్ కూడా సిద్ధమయ్యారు. అయితే, సదరు వాట్సాప్ సందేశాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. దాన్ని చూసిన ఉన్నతాధికారికి.. అందులోని అక్షరాలు, పేర్లలో దిద్దుబాటు ఉందని అనుమానం వచ్చింది. పాజిటివ్ రిపోర్టు ఇచ్చిన గాయత్రి ల్యాబ్కు వెళ్లమని ఆదేశించారు. దీంతో కూకట్పల్లిలోని ల్యాబ్లో నిర్వాహకులు వినయ్, రత్నాకర్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. తాము రూ. 1200 తీసుకుని పాజిటివ్ రిపోర్టు ఇచ్చినట్లు తెలిపారు.

అఖిలప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి ప్లాన్.. చివరకు..
భార్గవ్ రామ్కు కరోనా పాజిటివ్ సర్టిఫికేట్ తీసుకునేందుకు అఖిలప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్ 10 రోజుల క్రితమే ప్లాన్ వేశాడు. కూకట్పల్లిలోని ప్రతిమ ఆస్పత్రిలో పనిచేస్తున్న వినయ్ అనే వ్యక్తి తనకు తెలుసని అతడికి చెబితై పనైపోతుందని, అడిగినంత డబ్బు ఇచ్చేద్దామని చెప్పాడు. వినయ్ సూచన మేరకు భార్గవ్ రామ్ గాయత్రి ల్యాబరేటరీకి వెళ్లాడు. అక్కడ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. అయితే, వారు కరోనా పాజిటివ్ అని రిపోర్టు ఇచ్చారు. ల్యాబ్కు వెళ్లిన పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు సేకరించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న భార్గవ్ రామ్, జగద్విఖ్యాత్ రెడ్డి కోసం పోలీసులు ఏపీతోపాటు మహారాష్ట్రలోని గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications