ఘట్టమనేని మహేష్ అనే నేను...: రాజకీయాల్లోకి ప్రిన్స్: జాతీయ మీడియాలో హల్ చల్..!!
ప్రిన్స్ మహేష్ బాబు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా. అందుకు ఆయన సంకేతాలు ఇస్తున్నారా. ప్రస్తుతం జాతీయ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. సూపర్ స్టార్ క్రిష్ట వాసరుడిగా హీరోగా తిరుగులేని మాస్ ఫాలోయింగ్ను సాధించిన మహేష్ బాబు ఇప్పుడు రాజకీయాల మీద ఆసక్తిగా ఉన్నట్లు కధనాలు వస్తున్నాయి. అయితే గతంలో ఇటువంటి వార్తలు వచ్చిన సమయంలో మహేష్ బాబు వాటిని ఖండించారు. కానీ, తిరిగి ఇప్పుడు అదే తరహాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
'మహేష్ బాబు తండ్రి క్రిష్ట కాంగ్రెస్ లో పని చేసారు. తల్లి విజయ నిర్మల అప్పట్లో టీడీపీలో తక్కవ కాలం కొనసాగారు. ఇక, వైయస్ సీఎం అయిన తరువాత ఆయనతో క్రిష్ట కుటుంబం క్లోజ్ అయింది. మహేష్ బాబు సైతం గతంలో జగన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసారు. ఇక, మహేష్ బాబు బాబాయ్ ఆది శేషగిరి రావు..బావ జయదేవ్ మాత్రం ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. దీంతో..మహేష్ బాబు పొలిటికల్ ఎంట్రీ పైన వస్తున్న కధనాలతో అటు రాజకీయంగా..ఇటు సినిమా ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.

రాజకీయాల్లోకి మహేష్ బాబు
భరత్ అనే నేను సినిమాలో యంగ్ సీఎంగా అదరగొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ..ఇప్పుడు నేరుగా ఘట్టమనేని మహేష్ అంటూ ప్రజల్లోకి రావాలనే ఆలోచనతో ఉన్నారా. నిజంగా ఆయన రాజకీయంగా ఎంట్రీ ఇస్తారా..ఇస్తే ఏ పార్టీ నుండి మొదలు పెడతారు..ఇప్పుడు జాతీయ మీడియాలో వస్తున్న కధనాలతో ఈ చర్చ ఆసక్తి కరంగా మారింది. మహేష్ బాబు కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. తండ్రి క్రిష్ట కాంగ్రెస్ లో పని చేసారు. రాజీవ్ హయాంలో ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ సమయంలో టీడీపీ అధినేత ఎన్టీఆర్ లక్ష్యంగా సినిమాలు సైతం నిర్మించటంతో పాటుగా అందులో నటించారు.
ఇక, విజయ నిర్మల కొద్ది కాలం టీడీపీలో కొనసాగారు. ఇక, వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన తరువాత క్రిష్ట..విజయ నిర్మల..ఆది శేషగిరి రావు వైయస్ కు దగ్గరయ్యారు. ఆది శేషగిరి రావు వైయస్ మరణం తరువాత జగన్ రాజకీయంగా నిలదొక్కుకోవటంతో అండగా నిలిచారు. అయితే, తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో ఆది శేషగిరి రావు టీడీపీలోకి వెళ్లారు. ఇక, మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ గుంటూరు నుండి రెండో సారి టీడీపీ నుండి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆది శేషగిరి రావు వైసీపీలో ఉన్న సమయంలో క్రిష్ణ..మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ ఉప ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, పొలిటికల్ ఎంట్రీ గురించి మహేష్ మాత్రం ఎక్కడా తన మనసులో మాట బయట పెట్ట లేదు. ఇప్పుడు జాతీయ మీడియాలో మాత్రం కధనాలు వస్తున్నాయి.
మహేష్ ఏ పార్టీ నుండి ఎంట్రీ ఇస్తారు..
నిజంగానే మహేష్ బాబు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా..అనే చర్చకు మహేష్ మాత్రమే సమాధానం ఇవ్వాలి. మహేష్ త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్నారంటూ వార్తలు మీడియా సర్కిల్స్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం మహేష్ మాత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ తరహా ప్రచారం కొత్తదేమీ కాదు. గతంలోనూ మహేష్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరగింది. అప్పట్లో ఈ వార్తలపై స్పదించిన మహేష్ వాటిని కొట్టిపారేశారు. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, తాను నటన తప్ప వేరే ఏది చేయనని కుండ బద్దలు కొట్టేశారు.
కానీ, ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కొత్త తరానికి వస్తున్న అవకాశాలను పరిగణలోకి తీసుకొని మహేష్ బాబు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారా అనేది కొత్త చర్చ. తాజాగా జరిగిన ఎన్నికలకు ముందు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు వైసీపీ అధినేత జగన్ కు మద్దతుగా కొన్ని వ్యాఖ్యలు చేసారు. అప్పట్లో అది పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. ఇప్పుడు తెలుగు మీడియాలో కాకుండా జాతీయ మీడియాలో వస్తున్న కధనాలు అనేక అంచనాలకు కారణమవుతున్నాయి. అంటే ఆయనతో జాతీయ పార్టీ నేతలెవరైనా టచ్ లో ఉన్నారా..వారిచ్చిన సమాచారం మేరకే ఈ వార్తలు వస్తున్నాయా అనే సందేహం కూడా మొదలైంది. అయితే..దీని పైన ప్రిన్స్ అభిమానులు మాత్రం ఆసక్తిగా ఉన్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే మహేష్ మాత్రమే క్లారిటీ ఇవ్వగలరు.












Click it and Unblock the Notifications