జగన్ కన్నా.. పవన్ ప్రభంజనం వెనుక: బీజేపీ వైపే, షాకిచ్చిన మంత్రి
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్యటన ద్వారానే రాజధాని ప్రాంత రైతుల ఆందోళన మరింత వెలుగులోకి వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు రైతుల ఆమోదంతోనే భూసేకరణ చేశామని ప్రభుత్వం, రైతుల ఆమోదం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయని, అయితే పవన్ నాలుగు గ్రామాల్లో పర్యటించడంతో.. రైతుల ఆగ్రహం స్వయంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
రెండు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఆయనకు కొందరు మద్దతు పలకగా, మరికొందరు వ్యతిరేకించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, జగన్ పర్యటన కంటే పవన్ పర్యటన ద్వారానే రైతుల ఆందోళన వెలుగు చూసిందని అంటున్నారు.
దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. జగన్ పర్యటన రాజకీయపరమైనదిగా అందరూ భావించారు. ఆయన ప్రతిపక్ష నేత. అయితే పవన్ టీడీపీ మిత్రుడిగా వెళ్లి అడగారని, ప్రశ్నించేందుకు వచ్చారని.., అధికార పార్టీకి దగ్గరి వాడు కావడంతో తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో.. ఇలా పలు కారణాలతో కూడా పవన్ ప్రభంజనం కనిపించిందని అంటున్నారు. ఆయన అభిమాన గణం కూడా తరలి రావడంతో కొంత కోలాహలంగా కనిపించిందని అంటున్నారు.
నిలదీసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్తో ఊరట లభిస్తుందని భావించి ఉంటారని అంటున్నారు. ప్రజలు ఆశలకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ స్పందన ఉంది. తాను ఏ పార్టీకి అయితే మద్దతిచ్చాడో అదే పార్టీని నిలదీశారు. రాజధాని ప్రాంత రైతుల భూమి బలవంతంగా లాక్కుంటే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకడుగు వేసేది లేదని హెచ్చరించారు. దీంతో మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆయన వ్యాఖ్యల పైన స్పందించవలసి వచ్చింది.
న్యాయం జరిగేనా.. మంత్రి వ్యాఖ్యలు జగన్కే కాదు పవన్కూ
అయితే, మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తర్వాతనైనా రైతులకు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆయన వ్యాఖ్యల పైన అధికార పార్టీ స్పందించింది. రైతులు ఇష్ట ప్రకారమే భూములు ఇచ్చారని, రాజధాని భూసమీకరణ అయిపోయాక జగన్ పర్యటించడమేమిటని మంత్రి నారాయణ అన్నారు.
అయితే, ఈ మాటలు పవన్ కళ్యాణ్కు కూడా వర్తిస్తాయని చెప్పవచ్చు. భూసమీకరణ నిజంగానే పూర్తయితే.. జగన్ మాత్రమే కాకుండా పవన్ వచ్చినా లాభం లేదనే అందులో అర్థం స్ఫూరిస్తుందని అంటున్నారు. అంతేకాదు, ఎవరేమనున్నా రాజధాని అక్కడే ఉంటుందని కూడా మంత్రి నారాయణ చెప్పారు.
బీజేపీకి అనుకూలమా?
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయా అనే చర్చ సాగుతోంది. పవన్ బీజేపీకి దగ్గరివాడనే విషయం తెలిసిందే. ప్రత్యేక ప్యాకేజీ కోసం తనకు రోడ్డెక్కే దమ్ము ఉందని, దీనిపై కేంద్రంతో మాట్లాడుతామని పవన్ చెప్పారు. అయితే, ప్రత్యేక ప్యాకేజీ రాకుంటే అది మన ప్రజాప్రతినిధుల వైఫల్యమే అవుతుందని ట్విస్ట్ ఇచ్చారు.
రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడుతూ మాత్రం ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. పలుమార్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను పల్లె వేశారు. అత్యవసర స్థితిలో మాత్రమే భూమిని తీసుకోవాలని, అదీ 5 శాతమేనని రాజ్ నాథ్ చెప్పారని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగానే కనిపిస్తున్నాయని అంటున్నారు.