ఈసారి పోలవరం ప్రాజెక్ట్ ఆఫీసులో ఫైళ్లు దగ్ధం..!
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఫైళ్లు దగ్ధం అవుతున్నాయి. ఇటీవలే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. ఫైళ్ల దహనం వెనుక వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిధున్ రెడ్డి స్పందించారు.
ఫైళ్లు దగ్ధంతో తమకు ఎటువంటి సంబంధం లేదని, మీ ప్రభుత్వమే అధికారంలో ఉందని కావాలంటే దీనిపై సీబీఐ విచారణ ఆదేశించాలని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ కేసు విచారణలో ఉండగానే పోలవరం ఆఫీసులో కూడా ఫైళ్లు దగ్ధం కావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఫైళ్లు దగ్ధమయ్యాయనే విషయం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన కొన్ని ఫైళ్లు దహనం అయినట్టు తెలుస్తోంది. భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం విషయంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు వినిపించాయి.

ఆ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే ఈ ఘటనకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సీరియస్గా రియాక్ట్ అయిన వేదవల్లి ప్రాథమిక విచారణకు ఆదేశించారని తెలుస్తోంది. ఎన్ని ఫైళ్లు దగ్దమయ్యాయి.. దగ్దమైన వాటిలో ఉన్న సమాచారం ఏమిటి అనే విషయాలపై విచారణ చేపట్టారు. అయితే పోలవరం ఎడమ కాల్వకు సంబంధించి లబ్ధిదారుల పరిహారాలకు సంబంధించిన ఫైళ్లు దగ్దమైన వాటిలో ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో దీనికి ఎవరు కారణం, ఏమిటి కారణం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక ఆఫీసు సిబ్బంది ఉండి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని బయటకు రాకుండా అధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు.












Click it and Unblock the Notifications