ఎపిలో ఆర్థికమంత్రుల సదస్సుకు...ఎందుకు సగం మంది ఎగ్గొట్టారు?
ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం నేపథ్యంలో కేంద్రంపై సీఎం చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటంలో ఆయన శత్రువును దెబ్బతీసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే చంద్రబాబు 15వ ఆర్థికసంఘం విధివిధానాలను వ్యతిరేకిస్తూ 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశం ద్వారా కేంద్రాన్ని వ్యతిరేకించే రాష్ట్రాల సంఖ్య మరింత పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశించారు. అయితే అనుకున్నదొకటి అయిందొకటి అన్న చందంగా ఈ సమావేశానికి ఆయన మొత్తం 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులను ఆహ్వానిస్తే ఆతిథ్య రాష్ట్రం కాకుండా మరో ఆరు రాష్ట్రాల ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. తెలంగాణాతో సహా మరో ఐదు రాష్ట్రాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. అయితే దీనికి కారణమేమిటనే విషయంపై రాజకీయ పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమావేశం...అసలు ఉద్దేశం
కేంద్ర ప్రభుత్వంపై తాను చేస్తున్న పోరు ను మరింత ఉధృతం చేసేందుకు ఇతర రాష్ట్రాలను కూడా కూడగట్టే లక్ష్యంతో 15వ ఆర్థికసంఘం విధివిధానాలను వ్యతిరేకించే నినాదంతో అమరావతిలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ మూడు అంశాలపై తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించారు. ఈ విషయమై బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒదిలేసిన చంద్రబాబు 11 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన సీఎంలకు లేఖలు రాసి మరీ ఈ సమావేశానికి రప్పించేందుకు ప్రయత్నం చేసినట్లు సమాచారం. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక ఇవ్వాలని చంద్రబాబు భావించారని తెలుస్తోంది.
పిలిచింది...ఎవరెవరిని?
పొరుగురాష్ట్రాలైన తెలంగాణా,తమిళనాడు, ఒడిశా తో పాటు కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్, పుదుచ్చేరి, సిక్కిం, మేఘాలయ, మిజోరాం తదితర రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో పాటు సిఎంలను ఆతిథ్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్న కారణంగా ఈ సమావేశానికి ఆ రాష్ట్ర మంత్రి హాజరుకావట్లేదని ముందే తెలియజేసినట్లు తెలిసింది.
వచ్చిందెవరు?...రాని దెవరు?...
కేంద్రం తీరుకు నిరసనగా, 15వ ఆర్థిక సంఘం విధివిధానాల వల్ల రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ అమరావతిలో ఈ ఉదయం నుంచీ జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ముగిసింది. 15వ ఫైనాన్స్ కమిషన్ విధి విధానాలను సవరించాలని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశానికి ఆతిధ్య రాష్ట్రం కాక 6 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేరళ ఆర్థికమంత్రి థామస్ ఇసాక్, పంజాబ్ ఆర్థికమంత్రి మన్ప్రీత్సింగ్, పశ్చిమ బెంగాల్ ఆర్థికమంత్రి అమిత్మిత్రా, కర్ణాటక వ్యయ కార్యదర్శి ఏక్రూప్కౌర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణాతో పాటు ఇతర పక్క రాష్ట్రాలు ఒడిశా, తమిళనాడు ఈ సామావేశానికి గైర్హాజరు కాగా సిక్కిం,మేఘాలయ,మిజోరాం కూడా డుమ్మాకొట్టాయి.
పిలిచినా...ఎందుకు రాలేదు...
అయితే చంద్రబాబు కేంద్రంపై స్పష్టంగా తిరుగుబాటు బావుటా ఎగరవేయడమే ఆరు రాష్ట్రాలు ఈ సమావేశానికి హాజరుకాకపోవడానికి కారణం అయి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులల్లో కొందరి అభిప్రాయం. కారణం కేంద్రంతో ఏకాఏకీన ఘర్షణకు దిగితే ముందు ముందు ఏం జరుగుతుందో నన్న భయం కారణంగానే కొన్ని రాష్ట్రాలు వెనుకడుగు వేసి ఉండొచ్చని వారు విశ్లేషిస్తున్నారు. నిధుల లేమి పీడిస్తున్న తరుణంలో కేంద్రంతో విభేధాలంటే పరిస్థితి మరింత గోరంగా తయారవుతుందేమోనన్న భీతి వారిని పీడిస్తుండవచ్చని అంటున్నారు.
భిన్నాభిప్రాయాలు...కూడా ఉన్నాయి
అయితే కేంద్రంపై స్పష్టంగా వ్యతిరేకత ప్రకటిస్తున్న తెలంగాణా రాష్ట్రం కూడా ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనించాలని మరికొందరు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు తో జతకడితే ఏమవుతుందో నన్న ఆందోళన, చంద్రబాబు తన స్వీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంపై పోరాటానికి తెలరతీసారని, అలాంటప్పుడు ఆయన వ్యూహంలో పాత్రధారులు కావడం ఎందుకు అనే అభిప్రాయంతో ఒకరిద్దరు హాజరుకాలేదని తెలుస్తోంది. వీరిలోనే కొందరికి కేంద్రంపై పోరాటం చేయాలని ఉన్నా చంద్రబాబు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటారో అనూహ్యం కాబట్టి ఈ సమయంలో ఆయన వెనుక వెళ్లి కేంద్రానికి శత్రువుగా మారితే రేపు భవిష్యత్తులో వారు మళ్లీ మిత్రులుగా మారితే పరిస్థితి ఏమిటనే భయం కూడా ఉందంటున్నారు. ఏదేమైనా ఈ సమావేశం చంద్రబాబుకు కూడా కేంద్రపై పోరాటం విషయంలో కలసివచ్చేదెవరు?...రానిదెవరు అనే విషయంపై స్పష్టత తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందని, ఆ మేరకు ఈ సమావేశం వల్ల చంద్రబాబుకు ప్రయోజనమేనని కొందరు రాజకీయ పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.