దుర్గమ్మకు తొలి మహిళ పూజలు, పర్యటన ముగిసేవరకు సవిత వెంటే అఖిలప్రియ
కర్నూలు: భారత రాష్ట్రపతి సతీమణి, దేశ తొలి మహిళ సవితా కోవింద్ ఏపీ పర్యటనకు పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేసింది. సవితా కోవింద్ తొలిసారి ఏపీకి వస్తుండగా ఆమె పర్యటనకు సంబంధించి బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖకు అప్పగించింది.
చదవండి: మోడీ-బాబులకు దిమ్మతిరిగే 'పవర్' పంచ్: ఆ ముద్ర చెరిపేసుకొని, వైసీపీ నోరు మూయించేందుకు రెడీ
Recommended Video
ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యటనకు సంబంధించి వివిధ అంశాలు, ప్రయాణ మార్గాలపై చర్చించారు.
చదవండి: పీకే వల్ల ఉపయోగం లేదా? జగన్ కీలక నిర్ణయాల వెనుక, అదీ ఆయన సూచనేనా?
పర్యటన ముగిసే వరకు సవితతోనే అఖిలప్రియ
ముసాయిదా కార్యక్రమాన్ని అనుసరించి రాష్ట్రపతి కోవింద్ దంపతులు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. రాష్ట్రపతి అక్కడి నుండి నేరుగా నాగార్జున యూనివర్సిటీ చేరుకుంటారు. విమానాశ్రయం వద్ద పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, ఎపి టిడిసి ఎండి హిమాన్హు శుక్లా తదితరులు సవితా కోవింద్ను స్వాగతించి, పర్యటన ముగిసే వరకు ఆమెతోనే ఉంటారు.
అమ్మవారి దర్శనం
తొలుత ప్రథమ మహిళ విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతున్న గులాబీల ప్రదర్శన స్థలానికి చేరుకుంటారు. ఏర్పాట్లను ఎపిటిడిసి ఇడి బాలసుబ్రమణ్య రెడ్డి పర్యవేక్షిస్తూ, సవిత కోవింద్కు స్వాగతం పలుకుతారు. అనంతరం సవిత ఇంద్రకీలాద్రికి చేరుకొని కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుంటారు. దేవాలయ కార్యనిర్వహణాధికారి సూర్యకుమారి ఏర్పాట్లకు నేతృత్వంలో దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజాదికాలు నిర్వహిస్తారు.
భవానీ ద్వీపంలో ఏర్పాట్లు
11.30 గంటలకు దేవాలయం నుండి బయలుదేరి భవానీపురం పున్నమి ఘాట్కు చేరుకుంటారు. అక్కడ పర్యాటక శాఖ నూతనంగా నిర్మించిన అతిధి గృహాలను సందర్శించి స్వల్ప విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ ఎపిటిఎ సిఇఓ, ఎపిటిడిసి ఎండి హిహాన్హు శుక్లా రాష్ట్ర పర్యాటక శాఖ కార్యకలాపాలను ఆమెకు వివరిస్తారు. అక్కడి నుండి నదీ విహారం ద్వారా భవానీ ఐలండ్కు చేరుకుంటారు. భవానీ ద్వీపంలో సాంస్కృతిక శాఖ విశేష ఏర్పాట్లను చేయాలని సమీక్ష నేపథ్యంలో ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు.
వారితో ప్రత్యేకంగా మాట్లాడుతారు
కళా బృందాలతో తొలి మహిళను ద్వీపంలోకి స్వాగతించాలని సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయ భాస్కర్కు సూచించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కొమ్ముకోయ, సవర, డప్పులు, గరగలు, కూచిపూడి నృత్యరీతులను ఇక్కడ ప్రదర్శింప చేస్తారు. మరోవైపు తెలుగుదనానికి చిహ్నంగా భాసిల్లే కొండపల్లి బొమ్మలను పరిశీలించి హస్తకళాకారులతో ప్రత్యేకంగా మాట్లాడతారు.
ఆ తర్వాత వెలగపూడి సచివాలయం
ఆ తర్వాత భవానీ ఐలండ్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు వెలగపూడి సచివాలయం చేరుకుంటారు. ఇక్కడి నుండి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కలిసి గన్నవరం చేరుకుంటారు. రూట్ మ్యాప్ వంటి అంశాలపై పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా ఎపిటిడిసి అధికారులను ఆదేశించారు.