సోనియాతో క్లోజ్: పురంధేశ్వరి దూకుడు, తప్పని చిరు
న్యూఢిల్లీ: తాను ఎప్పుడో మంత్రి పదవికి రాజీనామా చేశానని అయితే, అది ఆమోదం పొందిందా? లేదా? అన్నది ప్రధాని విచక్షణకే వదిలేస్తున్నానని కేంద్రమంత్రి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. తాను మాత్రం విధులకు హాజరు కావటం లేదని, తన వరకు తాను మంత్రిని కాదని ఆమె చెప్పారు. బుధవారం వెల్లోకి కేంద్రమంత్రులు వెల్లోకి పోవడంపై పురంధేశ్వరి స్పందించిన విషయం తెలిసిందే. తాను కచ్చితంగా తన ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్లమెంటులో నడుచుకోవాల్సి ఉందని, వెల్లోకి వెళ్లటమూ అందులో భాగమేనని చెప్పారు.
కాగా, పురంధేశ్వరి దూకుడు చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి పదవిని, సోనియాతో తనకున్న ప్రత్యక్ష సంబంధాన్ని బేఖాతర్ చేస్తూ ఆమె దూకుడు ప్రదర్శించారు. లోక్సభ వెల్లోకి దూసుకుపోయి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. సమైక్య నినాదాలు చేశారు. మిగిలిన మంత్రులూ తన వెంట నడిచేలా చూశారు. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకోకపోతే దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు.
ఎన్టీఆర్ కుమార్తెగానే కాకుండా తెలివైన రాజకీయవేత్తగా తనకంటూ ఇమేజ్ సాధించుకున్న పురందేశ్వరికి సోనియాతో సత్ససంబంధాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆమె బుధవారం లోక్సభలో ప్రదర్శించిన దూకుడు స్వపక్షంలోనే చర్చనీయాంశంగా మారింది. పార్టీ హైకమాండ్ వద్ద పురందేశ్వరికి ఉన్న పలుకుబడి తెలిసినవారెవరైనా ఆమె పార్టీ గీత దాటరని ఇంతకాలం భావిస్తూ వచ్చారు. అయితే బుధవారం సభలో ఆమె తీరు పార్టీవర్గాలను విస్మయానికి గురిచేసింది.
విభజన అంశం క్లయిమాక్స్కు రావడంతో ఆమె మంగళవారమే సహచర మంత్రులతో తాను వెల్లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే కేంద్రమంత్రి హోదాలో అలా చేస్తే బాగోదని కొందరు మంత్రులు ఆమెను వారించారు. అయితే, ఆమె వారి మాటలను బేఖాతర్ చేశారు. పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించి వెల్లోకి దూసుకెళ్లి దూకుడు ప్రదర్శించారు. వద్దని వారించిన సహచరమంత్రులనూ తన వెంట నడిచేలా చేశారు.
బాధే అయినా తప్పలేదని చిరు
వెల్లోకి వెళ్లి ఆందోళన చేపట్టడం పట్ల తాను బాధపడుతున్నానని అయితే, ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే నడచుకోవాల్సిన పరిస్థితి ఉందని మరో కేంద్ర మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజల సమస్యలు పరిష్కరించాలని పార్టీని, ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేకపోవడంతో ఆందోళన చేయక తప్పలేదన్నారు. తెలంగాణ వారైనా, సీమాంద్రులైనా హైదరాబాద్తోనే వారి జీవితం ముడిపడి ఉందన్నారు.