నవ్యాంధ్ర నీటి అవసరాల కోసం కృష్ణానదిపై మరో ఆనకట్ట, ఎక్కడ?
విజయవాడ: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి తాగునీటి అవసరాలు తీర్చేందుకు కృష్ణానదిపై మరో ఆనకట్టను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం, కృష్ణా జిల్లాలోని గనిఆత్కూరు గ్రామాల మధ్య ఈ బ్యారీజీ నిర్మించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
కృష్ణానదిపై ఈ బ్యారేజీ కట్టడం ద్వారా నీటి అవసరాలు తీరడంతో పాటు ఆ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు, మెట్ట ప్రాంతాల్లో భూగర్భ నీటి పరిమాణం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు ఖరీదు రూ. 2 వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బ్యారేజీలో నిల్వ చేసిన నీటిని సుమారు 60 లక్షల మంది ప్రజల అవసరాలను తీరుస్తుందని, అదనపు నీటి లభ్యతలను బట్టి రాయలసీమకు సులువుగా తరలించవచ్చనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

కృష్ణానదిపై బ్యారేజీ నిర్మించేందుకు వైకుంఠపురం అనువైన ప్రాంతమని ఇప్పటికే అధికారులు తేల్చారు. ఈ ప్రాంతం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన ఉంది. ఈ ప్రాంతంలో కృష్ణానది కొండను తాకుతూ నది ఉత్తర దిశగా తిరుగుతుంది.
అంతేకాదు హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. ఎద్దువాగు, మున్నేరు, పాలేరు, వైరా, కట్లేరు తదితర చిన్న నదులు ఈ ప్రాంతంలోనే నదిలో కలుస్తాయి. ఇక్కడ నది వెడల్పు కూడా చాలా ఎక్కువ.
ఇక్కడ మొత్తం 3 కిలోమీటర్ల మేర ఆనకట్టను నిర్మించాల్సి ఉంటుంది. తద్వారా 15 టీఎంసీల వరకూ నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. నది మధ్య లంక భూమి ఉన్నందున పర్యాటకంగానూ అభివృద్ధి సాధ్యమే. ఇన్ని సానుకూలతాంశాలు ఉన్నందునే ఏపీ ప్రభుత్వం మరో బ్యారేజీకి ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications