ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో...జగన్,చంద్రబాబు ఇద్దరికి ఇబ్బందేనా?
అమరావతి: నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయడానికి సుముఖంగా ఉన్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలియజేసిన సంగతి తెలిసిందే. అలా ప్రత్యేక కోర్టులు ఏర్పడి ప్రజాప్రతినిథుల నేరాల విచారణ జరిగాక ఏమవుతుంది? ఈ స్పెషల్ కోర్టుల ఏర్పాటు ఆంధ్రా రాజకీయాలను ప్రభావితం చేయనుందా? ఎపి ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు ఇద్దరు ఈ కోర్టు మెట్లెక్కనున్నారా? మరి తరువాత ఏం జరుగుతుంది?
నేరచరితులైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారించేందు కు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయడానికి సిద్దంగా ఉన్నట్లు కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి తెలపడం ఇలాంటి కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిథుల గుండెల్లో గుబులు రేపుతోంది. సుప్రీంకోర్టు సూచనలకు స్పందించిన కేంద్రం 2014 తర్వాత 13,500 కేసుల్లో నిందితులుగా ఉన్న దేశంలోని 1581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను సత్వరమే విచారించడానికి ఈ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని తెలియజేసింది. ఈ స్పెషల్ కోర్టులకు కొంత గడువు ఇస్తే వారిపై ఉన్న కేసుల సమాచారం సేకరించి విచారణను వేగవంతం చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇవ్వడం నేరచరితులైన పొలిటీషియన్స్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
ప్రత్యేక కోర్టుల నేపథ్యం...
దేశంలో ఉన్న 17వేల సబార్డినేట్ కోర్టుల్లో సగటున 4,200 కేసులున్నందున, రాజకీయ నేరస్థుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయాల్సిన అవశ్యకత ఉందని జస్టిస్ రంజన్ గగోయ్, నవీన్ సిన్హాల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక రాజకీయ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల సంఘం వివరణ...
దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ ఏ ప్రజాప్రతినిధి అయినా నేరాలకు పాల్పడినట్లు ఋజువైతే వారిని శాశ్వతంగా ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులుగా ప్రకటిస్తామని పేర్కొంది. అంతేకాదు రాజకీయాల్లో నేరస్థులను అడ్డుకోవడం కోసం ప్రత్యేకచట్టం రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా సుప్రీం కోర్టును ఎన్నికల సంఘం కోరింది. ఈ ప్రతిపాదనలపై సుప్రీం స్పందిస్తూ, దీనికి కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. అంతేకాదు ఇంతవరకు ఎందుకు మౌనంగా ఉన్నారని, దీన్నే మీరు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారా అని నిలదీసింది.
కేంద్రం కోర్టులోకి బంతి...
సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ, నేరాలకు పాల్పడినవారిపై ఎన్నికల్లో పోటీచేయకుండా జీవితకాల నిషేధించాలని కేంద్రానికి సిఫార్సు చేశామని తెలిపింది. అంతేకాకుండా నేరం రుజువైన వారికి ప్రస్తుతం ఉన్నఆరేళ్ల నిషేధాన్ని జీవితకాలంగా మార్చాలని సూచించినట్లు న్యాయవాదులు మీనాక్షి అరోరా, మోహిత్ రామ్లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు.కానీ దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదని వారు వెల్లడించారు.
కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన...
దీంతో వివిధ కేసులతో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులను సత్వరమే విచారించి, చర్యలు తీసుకునేందుకు గాను ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో ఉన్న 17వేల సబార్డినేట్ కోర్టుల్లో సగటున 4,200 కేసులున్నందున, రాజకీయ నేరస్థుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయాల్సిన అవశ్యకత ఉందని జస్టిస్ రంజన్ గగోయ్, నవీన్ సిన్హాల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2015లో ఈ విషయంపై కేంద్రం వైఖరి ని తెలియజేయాలని ఒకసారి కేంద్రాన్ని అడిగిన సుప్రీం కోర్టు గత నవంబరు లో మరోసారి ఇదే విషయాన్ని కేంద్రానికి గుర్తుచేసింది.
నిధుల కేటాయింపు...
సుప్రీంకోర్టు సూచనలపై స్పందించిన కేంద్రం ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు 7 కోట్ల 80లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు నివేదించింది. కోర్టులు ఏర్పాటు చేయటం మొదలై కేసుల అలాట్మెంట్ జరగటం మొదలైతే అసలు ప్రత్యేక కోర్టులు ఎన్ని అవసరం అవుతాయనే విషయంలో కూడా ఒక స్పష్టత వస్తుందని కేంద్రం తెలిపింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు...
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి దిశానిర్థేశం చేస్తూ ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రూ.7.8 కోట్లు వినియోగించాలని, వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణ ప్రారంభం కావాలని ఆదేశించింది. రెండు నెలల్లో ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల వివరాల నివేదిక ఇవ్వాలని, దేశంలోని 12 రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, కేంద్ర సర్కారు కేటాయించిన నిధులను హైకోర్టుల సూచనల మేరకు వినియోగించి ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని తెలిపింది.
ప్రత్యేక కోర్టులు ఏర్పాటైతే...
నేరచరితులైన ప్రజాప్రతినిథుల కేసులను విచారించేందుకే ఈ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తుండటం వల్ల అలాంటి వారికి విపత్కర పరిస్థితి తప్పదని అర్థం చేసుకోవచ్చు. పైగా నేరం రుజువైతే గతంలో లాగా ఆరేళ్లు కాకుండా జీవితకాల నిషేధం విధిస్తే రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లే.
ఎపిపై ప్రభావం...
ఈ స్పెషల్ కోర్టులు ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కారణం ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనాయకుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఇద్దరూ ఈ విధమైన కేసులు ఎదుర్కొంటుండటమే. ప్రతిపక్షనేత జగన్ పై అక్రమాస్తులతో సహా వివిధ కేసులుండగా, సిఎం చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు ఉన్న సంగతి తెలిసిందే.
ఏం జరుగుతుంది...
నేరచరితులైన ప్రజాప్రతినిథుల పై ఆరోపణలు రుజువైతే ఎన్నికల సంఘం సూచించినట్లు వారిపై జీవితకాలం నిషేధం వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్ పై ఉన్న కేసుల విచారణ జరిగి వీరిద్దరిపై నేరారోపణలు రుజువైన పక్షంలో వీరి రాజకీయ భవిష్యత్తు కూడా ముగియక తప్పదనేది అంగీకరించక తప్పని కఠోర సత్యం.