జగన్ సర్కార్ పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు-కోర్టు మాటవినకపోతే అంతే..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేసే క్రమంలో 8 మంది ఐఏఎస్ అధికారులు తాజాగా హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. కోర్టు ఆదేశాల్ని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం చెప్పినట్లు విని జైలుశిక్ష వరకూ తెచ్చుకున్నారు. చివరికి హైకోర్టు కరుణించడంతో సామాజిక సేవ శిక్షతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై స్పందించారు.
హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థ మీద ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఐఏఎస్ అధికారులకు హైకోర్టు తాజగా జైలుశిక్ష విధించడంపై స్పందించిన లక్ష్మీనారాయణ.. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా నడచుకోవాలి సూచించారు. లేకపోతే సమస్యలు తప్పవన్నారు. తాజాగా హైకోర్టు ఐఏఎస్ లకు విధించిన శిక్షలు అందులో భాగమేనన్నారు.
ఫుట్బాల్ మ్యాచ్లో ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోతే రెఫరీ రెడ్ కార్డు చూపించి వార్నింగ్ ఇచ్చే తరహాలోనే న్యాయవ్యవస్ధ కూడా అలాగే స్పందిస్తుందని లక్ష్మీనారాయణ అభివర్ణించారు. అధికారాలు ఉన్నాయి కదా అని శాసనవ్యవస్ధ కూడా ఇష్టానుసారం చట్టాలు చేయడానికి వీల్లేదని మూడు రాజధానుల బిల్లులపై వ్యాఖ్యానించారు. అలాగే ఇష్టం వచ్చినట్లు చేయడానికి కార్యనిర్వాహక వ్యవస్థకు కూడా అధికారం లేదన్నారు. కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయలేమని ప్రభుత్వం చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కోర్టు ఉత్తర్వు నచ్చని పక్షంలో ఉన్నత న్యాయాస్థానాలను ఆశ్రయించే అధికారం ఉంటుందని గుర్తుచేశారు. అంతే కానీ కోర్టు ఉత్తర్వుల్ని వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదంటూ ప్రభుత్వానికి చురకలు అంటించారు.