వీవీ లక్ష్మీనారాయణ జై భారత్ పార్టీ మ్యానిఫెస్టో-రైతులు, నిరుద్యోగులే టార్గెట్ గా పలు హామీలు..
రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్ నేషనల్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించింది. విజయవాడలో వీవీ లక్ష్మీనారాయణ దీన్ని విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా రైతులు, నిరుద్యోగుల్ని టార్గెట్ గా పెట్టుకుని పలు హామీలు ఇచ్చారు. వీటిని పక్కాగా అమలు చేస్తామన్నారు. ఈ మ్యానిఫెస్టోను ఆయా వర్గాలతోనే విడుదల చేయించడమే కాకుండా దీనికి పీపుల్స్ మ్యానిఫెస్టోగా వీవీ లక్ష్మీనారాయణ నామకరణం చేశారు.
జై భారత్ పార్టీ మ్యానిఫెస్టోలో హరిత విప్లప పితామహుడు స్వామినాథన్ పేరుతో ఉపాధి హామీ కింద ప్రతినెలా రైతులకు ఐదు వేలు ఇస్తామని ప్రకటించారు. రైతు పండించే పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. సామాజిక వర్గాల పేరుతో రైతన్నలను జైభారత్ పార్టీ విడదీయదన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి రుణాలు ఇచ్చేలా చేస్తామని వీవీ లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. రైతులకు వడ్డీ లేని రుణాలు, చట్టబద్దంగా రైతు కమిషన్ ఏర్పాటు వంటి హామీలు కూడా ఉన్నాయి.

కేంద్రం విత్తన చట్టం తెస్తామని పదేళ్లుగా చెబుతున్నా ఇప్పటివరకూ అది రాలేదని వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. కాబట్టి రాష్ట్రస్థాయిలో విత్తన చట్టం తీసుకువచ్చి అమలు చేస్తామన్నారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు పదిహేను వేలు.. పదిహేను రోజుల్లో చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఓ భారీ పరిశ్రమ నెలకొల్పుతామని, సొంత ప్రాంతాల్లోనే ఉపాధి మార్గాలను చూపిస్తామన్నారు. పట్టణ ఉపాధి హామీ పథకం కూడా అమలు చేస్తామన్నారు.
ఏడాదిలో వంద రోజులు ఉపాధి హామీ కింద పనులు అప్పగిస్తామని లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. జైభారత్ పార్టీ ప్రతి ఏడాది జనవరి 26న రిపబ్లిక్ రోజున గ్రూపు 1, గ్రూప్ 2 నోటిపికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే సెప్టెంబర్ లో ఉపాధ్యాయ పోస్టులు, అక్టోబర్ 21న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications