'టీడీపీ' అంటే అసలైన నిర్వచనం ఇదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..!
కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం పెద్ద డ్రామా అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుతం దౌర్భాగ్యపు పాలన నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ నేతలు ధైర్యంగా చెప్పుకోగలరా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మహానాడులో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలనూ సృష్టిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. అలాంటి వారికి వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ చెల్లిస్తామని వైఎస్ జగన్ హెచ్చరించారు.
"టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఉన్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఎక్కడ అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు.. డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో పడిపోతాడు" అని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాక టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని వైఎస్ జగన్ సంబోధించారు. సత్తా అంటే కడపలో మహానాడు కార్యక్రమం పెట్టడం కాదని.. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుందని అన్నారు. కడపలో మహానాడు కార్యక్రమం పెట్టి జగన్ ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జగన్ ప్రసంగించారు.

కూటమి ప్రభుత్వం చిన్న చిన్న హామీలను కూడా నెరవేర్చడం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఉచిత బస్సు కోసం కడపలో మహిళలు ఎదురు చూస్తున్నారని.. గ్యాస్ సిలిండర్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇక వచ్చే వైసీపీ 2.O ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు.. కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుందని వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications