జగన్తో అంబటి రాయుడు భేటీ- హామీ
అమరావతి: ఊహించినట్టే- మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్ను ఆరంభించబోతోన్నట్టే కనిపిస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీలో ఆయన చేరిక ఇక లాంఛనప్రాయమే. పార్టీలో చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.
కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడి స్వస్థలం గుంటూరు. రంజీల్లో హైదరాబాద్, ఆంధ్రా, విదర్భ, బరోడా జట్ల తరఫున ఆడారు. జాతీయ జట్టులోనూ చోటు సంపాదించారు. 55 వన్డేలు, ఆరు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడారు. టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్గా గుర్తింపు పొందారు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్లల్లో తనదైన శైలిలో మెరుపులు మెరిపించారు.

14 సీజన్లల్లో 204 మ్యాచ్లను ఆడిన అంబటి రాయుడు.. 4,348 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 ప్లేఆఫ్స్ మ్యాచ్లను ఆడిన ఘనత అంబటి రాయుడికి ఉంది. అలాగే ఎనిమిదిసార్లు ఫైనల్స్ ఆడాడు. అయిదుసార్లు ఛాంపియన్గా నిలిచిన జట్లల్లో అతను సభ్యుడు కూడా. ఐపీఎల్ 2023 సీజన్లోనూ ఆయన దూకుడు కొనసాగింది. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్స్లో జరిగిన రవీంద్ర జడేజాతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ను గెలిపించాడు.
ఇప్పటికే ఆయన క్రికెట్కు గుడ్బై చెప్పారు. మొన్నటి వరకూ ఐపీఎల్లో కొనసాగారు. దీనికీ వీడ్కోలు పలికారు. ఇక తన సెకెండ్ ఇన్నింగ్ రూపంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి సమాయాత్తమౌతున్నారు. వైఎస్ జగన్కు వీరాభిమానిగా గుర్తింపు ఉంది అంబటి రాయుడికి. వైఎస్ జగన్ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఆయన ఫాలో అవుతున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లల్లో యాక్టివ్.
సీఎం జగన్ను కలిసిన క్రికెటర్ అంబటి రాయుడు..!#AmbatiRayudu #YSJagan #APPolitics #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/DfFB1q90hr
— oneindiatelugu (@oneindiatelugu) June 8, 2023
వైఎస్ జగన్ చేసే పోస్టులకు సానుకూలంగా స్పందిస్తూ తన అభిమానాన్ని పలుమార్లు చాటుకున్నారు కూడా. రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఇప్పటికే పరోక్షంగా సంకేతాలు పంపించారాయన. క్రికెట్కు పూర్తిస్థాయిలో వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఇక లాంఛనంగా పొలిటికల్ ఇన్నింగ్ను ప్రారంభించబోతోన్నారు.
ఇందులో భాగంగా కొద్దిసేపటి కిందటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. సుమారు అరగంటకు పైగా ఆయనతో సమావేశం అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా బయటికి రాలేదు గానీ.. వైఎస్ఆర్పీలో చేరాలనే ఉద్దేశాన్ని జగన్కు తెలియజేశారని, దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని అంటోన్నారు. అన్ని సవ్యంగా సాగితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసే అవకాశం లేకపోలేదని సమాచారం.












Click it and Unblock the Notifications