ఢీకొట్టిన బైక్: మాజీ మంత్రి సత్యారావు కన్నుమూత
విశాఖపట్నం: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం విశాఖ బీచ్ రోడ్లో వాకింగ్ చేస్తుండగా.. గుర్తు తెలియని బైక్ ఢీకొని మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అయితే, వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు.
విశాఖపట్నం జిల్లా చోడవరం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1999లో వరుసగా విజయం సాధించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున చేసిన ఆయన.. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమిపాలయ్యారు.
ఆ తర్వాత నుంచి సత్యారావు క్రియా శీల రాజకీయాలు దూరంగా ఉంటున్నారు. కొంత కాలం తర్వాత ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మరణంతో చోడవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ దిగ్భ్రాంతి
మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బలిరెడ్డి కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. బలరెడ్డి ప్రజలకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. రంపచోడవరం నియోజకవర్గానికి ఆయన లేని లోటు తీర్చలేనిదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.