చంద్రబాబు ఆత్మీయ పలకరింపు-మాజీ మంత్రి బొజ్జల భావోద్వేగం- బర్త్ డే కేక్ కట్ చేయించి
ఏపీలో ఒకప్పుడు తన కేబినెట్ మంత్రిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో టీడీపీ అధినేత చంద్రబాబుకు మంచి అనుబంధమే ఉంది. అయితే చివరిసారిగా తన కేబినెట్లో ఉన్నప్పుడు మధ్యలోనే ఉద్వాసన పలికిన చంద్రబాబు చాలా కాలం తర్వాత తిరిగి ఆయన్ను పలకరించారు.
మాజీ మంత్రి బొజ్జల కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఇంటికే పరిమితం అయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన హైదరాబాద్ లోనే తన పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు కనిపించడంతో, అదీ తనను పరామర్శించడానికి రావడంతో బొజ్జల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబును చూడగానే చేతులు జోడించి అలాగే ఉండిపోయారు. చంద్రబాబు ఆయన యోగ క్షేమాలు తెలుసుకుంటునంతసేపు ఆయన చేతులు జోడించే ఉన్నారు. దీంతో చంద్రబాబుతో పాటు బొజ్జల కుటుంబ సభ్యులు ఆయన చేతుల్ని కిందకు దించారు.
బొజ్జల పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అంతే కాదు స్వయంగా బొజ్జలతో కేక్ కట్ చేయించారు. ఎప్పుడూ లేని విధఁగా తమ పార్టీ అధినేత స్వయంగా ఇంటికొచ్చి మరీ తనతో కేక్ కట్ చేయించడంతో బొజ్జల సంతోషంగా కనిపించారు. అయితే అనారోగ్యంతో మాట్లాడలేని స్ధితిలో ఉండటంతో చంద్రబాబును ఆలాగే చూస్తుూ ఉండిపోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. ఒకప్పుడు తన కేబినెట్ లో స్ధానం కల్పించడంతో పాటు పార్టీలోనూ తగిన ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రాజకీయాల్లో కష్టాల్లో ఉండగా.. బొజ్జల కూడా ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయన్ను ఇంటికెళ్లి మరీ పరామర్శించడం పార్టీలోనూ చర్చనీయాంశమవుతోంది.