ఫ్రెండ్లీ ఫైట్? అన్న టీడీపీలో..తమ్ముడు జనసేన పార్టీలో! నన్ను మోసం చేశారు: మాజీ ఎమ్మెల్యే ఆవేదన
అమరావతి: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం-జనసేన పార్టీ మధ్య ఫ్రెండ్లీ ఫైట్ కొనసాగుతుందా? అందుకే- కొన్ని కీలక నియోజకవర్గాల్లో బంధువుల, కుటుంబ సభ్యులను బరిలో దింపారా? అని ప్రశ్నిస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన ఫ్రెండ్లీ ఫైట్ లో తాను బలిపశువును అయ్యానని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి ఆవేదన వ్యక్తం చేస్తుండటం దీన్ని బలపరుస్తోంది. తన మనవడికి టికెట్ ఇస్తానని ఆశ చూపించి మరీ తనను పవన్ కల్యాణ్ పార్టీలో చేర్చుకున్నారని ఆమె అన్నారు. తీరా ఎన్నికలు సమీపించే సమయానికి వేరే వారికి టికెట్ కేటాయించారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారనే ఒకే ఒక్క కారణంతోనే వేరే అభ్యర్థిని బరిలో దింపారని భానుమతి విమర్శిస్తున్నారు. భానుమతి చెబుతున్న వివరాల ప్రకారం..
మాడుగుల: టీడీపీలో అన్న జనసేనలో తమ్ముడు
విశాఖపట్నం జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీలు అన్నాదమ్ములను బరిలో దింపాయి. తెలుగుదేశం పార్టీ తరఫున గవిరెడ్డి రామానాయుడు టికెట్ దక్కించుకున్నారు. ఆయన సోదరుడు సన్యాసి నాయుడిని జనసేన పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. నిజానికి- మాడుగుల అసెంబ్లీ టికెట్ భానుమతి మనవడు రఘురాజుకు దాదాపు ఖాయమైందనే అందరూ భావించారు. చివరి నిమిషంలో ఆమెను కాదని రామానాయుడు సోదరుడు సన్యాసి నాయుడిని రేసులో నిలిపింది జనసేన పార్టీ. టికెట్ ఇస్తామని ఆశ చూపించి, చివరి నిమిషంలో చంద్రబాబు చెప్పారనే కారణంతో సన్యాసి నాయుడికి ఇచ్చారని భానుమతి ఆరోపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన తన మనవడు రఘురాజుకు రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉంటుందని, మాడుగుల సీటు ఇస్తామని పవన్ కల్యాణ్ స్వయంగా ఆహ్వానించారని అన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం కూడా చేస్తున్నామని చెప్పారు. తన మనవడిని కాదని గవిరెడ్డి సన్యాసినాయుడికి టికెట్ కేటాయించారని చెప్పారు.
అమ్మ నాగబాబూ..! చంద్రబాబును తిట్టావా..? పొగిడావా..? అర్థం కాకుండా చురకలు అంటించావుగా..!!
రఘురాజు మాట్లాడుతూ.. తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కల్పించి, సీటు కేటాయిస్తానని చెప్పి ఇలా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గవిరెడ్డి సన్యాసినాయుడికి టికెట్ కేటాయించడం వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందన్నారు. టీడీపీని గెలిపించడమే ధ్యేయంగా జనసేన నుంచి తమకు అనుకూలమైన వారికి టికెట్లు ఇప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల చివరి నిమిషంలో సన్యాసినాయుడు నామినేషన్ ఉపసంహరించుకుని.. గవిరెడ్డి రామానాయుడు గెలవడానికి కృషిచేస్తాడనే ఆరోపణలున్నాయన్నారు. తమకు జరిగిన అన్యాయంపై పవన్ను ప్రశ్నిద్దామంటే ఆయన కలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.