టీడీపీకి మరో బిగ్ షాక్- చంద్రబాబుకు కొత్త తలనొప్పి..!!
తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఏలూరు: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఊహించినట్టే- టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు జయమంగళ వెంకటరమణ పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులు, ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన- కొద్దిసేపటి కిందటే తన నిర్ణయాన్ని ప్రకటించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

నాడు గెలిచి..
2009 ఎన్నికల్లో ఆయన కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. 2014లో ఆయనకు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా కైకలూరు సీటును బీజేపీ దక్కించుకుంది. బీజేపీ తరఫున కామినేని శ్రీనివాస్ పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప్పాల రామ్ ప్రసాద్ పై 21 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. ఆయన గెలుపులో అప్పట్లో జయమంగళ వెంకటరమణ హస్తం ఉందనేది బహిరంగ రహస్యమే.

కామినేని గెలుపుకోసం..
పొత్తులో భాగంగా టికెట్ ను కోల్పోయినప్పటికీ.. మిత్రధర్మాన్ని విస్మరించలేదు. బీజేపీ కామినేని శ్రీనివాస్ విజయానికి కృషి చేశారు. టీడీపీ ఓటుబ్యాంకును విజయవంతంగా బీజేపీకి మళ్లించగలిగారు. ఫలితంగా 2014 ఎన్నికల్లో కామినేని ఏకంగా 21 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయదుందుభి మోగించారు. 2009లో ఎన్నికలో అదే కామినేని శ్రీనివాస్.. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన ఓడిపోయినప్పటికీ- ఆ తరువాతి ఎన్నికల్లో జయమంగళ వెంకటరమణ సహకారంతో ఘన విజయం సాధించారు.

వైసీపీ చేతిలో..
2019 ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయ్యాయి. నాటి ఎన్నికల సమయానికి టీడీపీ-బీజేపీ పొత్తు లేదు. దీనితో తెలుగుదేశం పార్టీ మళ్లీ కైకలూరు టికెట్ ను జయమంగళకే కేటాయించింది. నాటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకోలేకపోయారు. ఓటమి చవి చూశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వర రావు చేతిలో 9,000 ఓట్లకు పైగా తేడాతో పరాజయాన్ని చవి చూశారు. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.

అధికారికంగా..
జయమంగళ.. టీడీపీకి గుడ్ బై చెప్పబోతోన్నారనే ప్రచారం ఇదివరకే జోరుగా సాగింది. సోమవారమే ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. అది సాధ్యపడలేదు. నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు, తన అభిమానులతో సమావేశం అయిన తరువాతే రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఈ మధ్యాహ్నం కైకలూరు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఎమ్మెల్సీగా..
ప్రస్తుతం కైకలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీదే. దూలం నాగేశ్వర రావు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఆయనను కాదని జయమంగళకు టికెట్ ఇచ్చే పరిస్థిితి లేదు. దీనితో ఆయనను శాసనమండలికి పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ హామీతోనే వైసీపీలో చేరడానికి సన్నద్ధం అయ్యారని సమాచారం. స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న విషయం తెలిసిందే. ఆ కోటా నుంచి జయమంగళను మండలికి పంపించే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications