ఉండవల్లి యూటర్న్- జగన్ ఇన్ ఛార్జ్ ల మార్పుపై ఫైర్-అప్పులతో పథకాలా ! టీడీపీ-జనసేన పొత్తుతో..
ఏపీలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం కాక రేపుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన దాదాపు 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్ధానంలో కొత్త వారిని ఇన్ ఛార్జ్ లుగా నియమించడం లేదా వారిని ఇతర చోట్లకు పంపడం ద్వారా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా జగన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఘాటుగా స్పందించారు.
రాష్ట్రంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రక్రియ సరిగ్గా లేదని ఉండవల్లి స్పష్టం చేశారు. సీట్ల మార్పుపై సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. టికెట్లు మార్చడం చాలా కష్టమైన పని అని, గతంలో తనను సీఎం చేయాలని సోనియాను అడిగినప్పుడు జగన్కు ఎదురైన ఫీలింగే ప్రస్తుతం ఎమ్మెల్యేల్లోనూ కనిపిస్తోందన్నారు. సీట్ల మార్పుతోనే గెలుపు అంటే ఏమీ చెప్పలేమన్నారు. ఏపీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదని గుర్తు చేశారు. అధికారం అంతా జగన్ మోహన్ రెడ్డి, వాలంటీర్ల చేతుల్లో మాత్రమే ఉందని అలాంటప్పుడు వారిని ఎలా బలి చేస్తారని ఉండవల్లి ప్రశ్నించారు.

రాష్ట్రంలో అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం ఎక్కడా చూడలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. దేశంలోనే గొప్ప ప్రయోగం చేశాంటూ పరోక్షంగా సెటైర్ వేశారు. మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీపై స్పందిస్తూ.. పార్టీ పెట్టడం ద్వారా సీట్లు సాధించకపోవచ్చు కానీ ఓట్లు ఎంత శాతం వచ్చాయన్నది రాజకీయ పరిణామాలు మారడానికి కారణమవుతుందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలవడం కచ్చితంగా వాళ్లకి బలమే అవుతుందన్నారు.
మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, తెలంగాణ ఎన్నికల ప్రభావం కచ్చితంగా కనపడుతుందని ఉండవల్లి తెలిపారు. పార్లమెంట్ లో నెహ్రూను విమర్శించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఉండవల్లి ఫైర్ అయ్యారు. జవహర్ లాల్ నెహ్రూ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అమితమైన అభిమానమని, అలాంటి నెహ్రూను విజయసాయి పార్లమెంట్లో ఎలా తప్పుబడతారన్నారు.












Click it and Unblock the Notifications