వైసీపీలోకి చేరికలు - వెయిటింగ్ లిస్టులో కీలక నేతలు : ఆ ఒక్కటే పెండింగ్..!!
ఏపీలో క్రమేణా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ సారి సీఎం జగన వర్సస్ చంద్రబాబు మధ్య పోటీ హోరీ హోరీగా భావిస్తున్నారు. ఇక, పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా..పొత్తులో భాగంగా టీడీపీతో కలుస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీతో కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక, 2014లో చంద్రబాబు..2019 లో జగన్ అమలు చేసిన పొలిటికల్ మైండ్ గేమ్ మరోసారి ఇప్పుడు అమలు కావటం ఖాయంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల వేళ..నాటి కాంగ్రెస్ నుంచి అనేక మంది సీనియర్లను టీడీపీలోకి ఆహ్వానించారు. దీని ద్వారా టీడీపీ గెలుపు ఖాయమనే చేరికలు కొనసాగుతున్నాయనే ప్రచారం కొనసాగింది. అదే విధంగా 2019 ఎన్నికల సమయంలో..జగన్ ఇదే ఫార్ములా అమలు చేసారు. సినీ ఇండస్ట్రీతో పాటుగా.. రాజకీయంగా పలువురు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వారిలో ముందస్తుగానే టికెట్ హామీతో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు సైతం సీఎం జగన్ పార్టీలో చేరికల పైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ప్రతిష్ఠాత్మకంగా మారతున్న ఎన్నికలు
2019లో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరయ్యారు. కానీ, గతంలో చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించారని..మంత్రి పదవులు ఇచ్చారంటూ అసెంబ్లీ బహిష్కరించిన జగన్..ఇప్పుడు తాను అదే విధంగా వ్యవహరించకూడదనే ఉద్దేశంతో వారిని అధికారికంగా పార్టీలోకి చేర్చుకోలేదు. వారి వారసులకు మాత్రం పార్టీ కండువా కప్పారు. రాజకీయ భవిష్యత్ పైన హామీ ఇచ్చారు. మరి కొందరు ఎమ్మెల్యేలు సైతం వైసీపీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేసారు. కానీ, మరెవరూ ముందుకు రాలేదు. అయితే, ఇతర పార్టీల్లో ఉన్న నేతలు..తటస్థంగా ఉన్న వారిని వైసీపీలోకి తీసుకొనేందుకు మంత్రాంగం పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో గతంలో కాంగ్రెస్ లో మంత్రులుగా పని చేసిన గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు నేతలు ఉన్నారని తెలుస్తోంది. అదే విధంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రాజధాని జిల్లాకు చెందిన మాజీ మంత్రి సైతం తాజాగా వైసీపీ నేతలతో టచ్ లోకి వచ్చినట్లు సమాచారం.
చేరికల విషయంలో ఆచి తూచి
టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఒక మాజీ సినీ నటి సైతం వైసీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో కొంత కాలం క్రితం వైసీపీలో చేరి పెద్దల సభకు ఎంపిక అయిన నేత..తన సొంత జిల్లా నుంచి మరో ఇద్దరు కీలక నేతలను పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లాలో గతంలో వైసీపీ లో అసెంబ్లీకి ఎన్నికై..ఆ తరువాత టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. అయితే, వారు తమకు టికెట్ ఖరారు చేయాలని కోరుతుండగా..అందుకు వైసీపీ ముందస్తు హామీలకు ససేమిరా అంటోంది. ఇక, టీడీపీ - జనసేన పొత్తు అంశం పైన క్లారిటీ వచ్చిన తరువాత సీట్లు రాని వారు పార్టీ మారటం సాధారణంగా చోటు చేసుకుంటుంది. ఇదే సమయంలో ఈ సారి పవన్ కళ్యాణ్ పెద్ద సంఖ్యలో సీట్లు డిమాండ్ చేస్తారని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
జంపింగ్స్.. జాయినింగ్స్
ఈ క్రమంలో టీడీపీలో సీట్ల కేటాయింపు నేతల పార్టీ మార్పుకు దారి తీస్తుందని భావిస్తున్నారు. అయితే, టికెట్ రాని వారందరికీ తమ పార్టీలో అవకాశం ఉండదనేది వైసీపీ నేతల అంతర్గత చర్చల్లో చెబుతున్న అంశం. ఇక, ప్రస్తుతం గడప గడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్న వేళ..ఎనిమిది నెలలు ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు..వారి గ్రాఫ్ పైన అంచనాకు డెడ్ లైన్ గా సీఎం జగన్ ఫిక్స్ చేసారు. ఆ సమయం ముగిసిన తరువాత.. అవసరానికి అనుగుణంగా పార్టీలో చేర్పులకు అవకాశం ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాగా, వైసీపీ నుంచి జంపింగ్ లకు పలువురు నేతలు సిద్దంగా ఉన్నారంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్దులు ఎవరనేది చూడవద్దని..తనను చూసి ఓట్లు వేయాలని కోరుతున్నారు. దీంతో.. దసరా నుంచి రాష్ట్రంలో పార్టీల్లో జంపింగ్ లు.. చేరికలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.