Anil Kumar Yadav : జగన్ చెప్తే తప్పుకుంటా ! పార్టీ మార్పుపై అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ..
వైసీపీ తరపున రెండుసార్లు నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ పార్టీ మారబోతున్నట్లు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైసీపీలోనే ఉన్న ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తో విభేదాల నేపథ్యంలో టీడీపీలోకి వెళ్లొచ్చని, లేకపోతే జనసేన తరఫున బరిలోకి దిగొచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే వైసీపీలో ఈసారి సగం మంది ఎమ్మెల్యేలు కూడా గెలవరంటూ అనిల్ చెప్పినట్లు కూడా వార్తలొచ్చాయి. దీనిపై ఇవాళ ఆయన స్పందించారు.
రాజకీయాల్లో ఉన్నంత కాలం తన చివరి శ్వాస వరకు జగన్ వెంటే ఉంటానని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. జగన్ కోసమే పని చేస్తానన్నారు. జగనన్న నన్ను తరిమేసినా.. తిట్టినా.. నువ్వు ఈ పార్టీలో ఉండొద్దని చెప్పినా.. నా తండ్రి సాక్షిగా చెబుతున్న నేను జగన్ వెంటే ఉంటా అన్నారు. వేరే గుమ్మం తొక్కే ప్రసక్తే లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి మాకు ఒక వ్యసనం.. ఆయన కోసం ఏమైనా చేస్తా అని అనిల్ తెలిపారు. తాను ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా అది జగన్ బిక్ష అన్నారు.

తాను కొందరితో దూరంగా ఉంటున్నానని అనిల్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ పై పరోక్షంగా కామెంట్ చేశారు. ఒక మనిషి పై మనకు మంచి అభిప్రాయం లేనప్పుడు దూరంగా ఉండటం మేలన్నారు. ఒక పెళ్లికి వెళ్లి అక్షింతలు వేసి తాళి ఎప్పుడు తెగుతుందా అని దీవించే కన్నా పెళ్లికి వెళ్లకపోవడమే మేలని భావించే వ్యక్తిని తాను అన్నారు. పక్క పక్కన కూర్చుని వీడి ఎప్పుడు నాశనం అయిపోతాడా అని కోరుకునే బదులు దూరంగా ఉండడమే గౌరవమన్నారు. దాని ప్రకారమే నేను నడుచుకుంటున్నా, అందుకే కొందరితో విభేదాలు అని అనిల్ అన్నారు.
పేరున్న గొర్రె కన్నా ఒంటరిగా సింహం గా ఉండటం మేలని అనిల్ వ్యాఖ్యానించారు. సంవత్సరం పాటు నా గురించి కొందరు రకరకాలుగా మాట్లాడారన్నారు. సమయం వచ్చినప్పుడు అవన్నీ సీఎం జగన్ కు చెప్తానన్నారు. బాధ కలిగితే కచ్చితంగా సీఎం జగన్ చెప్పుకుంటానన్నారు. అనిల్.. నెల్లూరు సిటీలో ఓడిపోతావు.. నువ్వు తప్పుకో అని సీఎం జగన్ చెబితే బంగారంగా తప్పుకుంటానన్నారు. ఇది నాకు జగన్ ఇచ్చిన పదవి, ఆయన తీసుకుంటానంటే ఎలాంటి అభ్యంతరం చెప్పనన్నారు.
రాజకీయాల్లో తన భవిష్యత్తును ఆ భగవంతుడు, జగన్మోహన్ రెడ్డి, నెల్లూరు ప్రజలు నిర్ణయిస్తారన్నారు.

అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆపుతున్నట్లు అనిల్ పేర్కొన్నారు. వైసీపీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవరని తాను మాట్లాడినట్లు వస్తున్న వార్త ఫేక్ న్యూస్ అన్నా రు. గత మూడు నాలుగు రోజుల నుంచి రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఎవరికివారుగా యూట్యూబ్ ఛానల్స్ మరియు సోషల్ మీడియాలో నా మీద తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు. వారందరికీ కూడా ఒకటే చెబుతున్న మా తండ్రి వర్ధంతి సాక్షిగా చెప్తున్నా నాకు జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఇంకొకరు తెలియదన్నారు.
తన ప్రాణం ఉన్నంతవరకు వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడుస్తా ఒకవేళ జగనన్న నువ్వు వద్దు వెళ్ళిపో అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు కోసమే పని చేస్తానన్నారు. తనకు మొండితనం మూర్ఖం ఎక్కువ నన్ను జగన్మోహన్ రెడ్డి గారి తప్పితే ఇంకెవరు కూడా భరించలేరు నా కడస్వాస వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పని చేస్తా అన్నారు.












Click it and Unblock the Notifications