వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం ? అసలేం జరిగిందంటే..
ఏపీలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ నేతలు దాదాపుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇంకొందరు పరాజయాన్ని జీర్ణించుకోలేక భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారు జామున పెందుర్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆస్పత్రిలో చేరారు. రాత్రి నిద్రమాత్రలు మింగి ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
తెల్లవారు జామున రెండున్నర గంటల సమయంలో నిద్రమాత్రలు మింగి అదీప్ రాజ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, గుర్తించిన బంధువులు ఆయన్ను విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేశారు. పోలీసులు ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో అసలేం జరిగిందో క్లారిటీ ఇస్తూ అదీప్ రాజ్ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వివరించారు.

తాను ఆత్మయత్నాయత్నం చేసుకున్నానంటూ ఇవాళ ఎంతో స్పీడుగా పుకార్లు హల్ చల్ చేస్తున్నాయని అదీప్ రాజ్ తెలిపారు. నిన్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, సాయంత్రం డిన్నర్ కు వెళ్లి వచ్చానని తెలిపారు. అర్ధరాత్రి పుడ్ పాయిజన్ వల్లో, గ్యాస్ వల్లో ఇబ్బంది తలెత్తిందని దీంతో తాను ఆస్పత్రిలో చేరానన్నారు. అయితే ఉదయం 6 గంటలకు తాను డిశ్చార్జ్ అయ్యాయని తెలిపారు. ఇవాళ తన కుమారుడిని స్కూల్లో చేర్చినట్లు అదీప్ రాజ్ తెలిపారు. కాబట్టి తన ఆత్మహత్య వార్తలను నమ్మొద్దని కోరారు. ఓడిపోయిన బాధలో ఉన్న తమను ఇంకా ఇబ్బందిపెట్టేందుకే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అదీప్ రాజ్ వెల్లడించారు. త్వరలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు.












Click it and Unblock the Notifications