ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆ బస్సుల పని గోవిందా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుండి స్త్రీ శక్తి పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వ తీరుతో ఏపీ వ్యాప్తంగా మహిళలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరో కొత్త సమస్య కూడా వచ్చి పడింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తూ ఉండడంతో నాన్ స్టాప్ బస్సు సర్వీసులపైన తీవ్ర ప్రభావం పడుతుంది.
స్త్రీశక్తి పథకంతో నాన్ స్టాప్ బస్సులకు దెబ్బ
నాన్ స్టాప్ బస్సు సర్వీసులను ఎక్కడానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలామంది విముఖతను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి నడిచే నాన్ స్టాప్ బస్సులు నిర్వహణ ఖర్చులు కూడా రాని విధంగా ఖాళీగా తిరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం సాధారణంగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రయాణం చేస్తారు.

నాన్ స్టాప్ బస్సులు పెద్దగా ఎక్కని ప్రయాణికులు
మహిళలకు ఉచిత బస్సుల్లో ఎక్కించి, పురుషులు వేరే బస్సుల్లో ఎక్కాలంటే ఆసక్తి చూపించడం లేదు. కాబట్టి మహిళలతో పాటు పురుషులు కూడా అవే బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సులలో మహిళలు జీరో టికెట్ మీద, పురుషులు చార్జీలు చెల్లించి ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం నాన్ స్టాప్ బస్సు సర్వీసులు మీద తీవ్రంగా పడుతోంది.
నష్టాల్లో నాన్ స్టాప్ బస్సులు
ప్రయాణికుల సంఖ్య తగ్గుతూ ఉండడంతో నాన్ స్టాప్ బస్సు సర్వీసులను నడపడం ఆర్టీసీకి కష్టంగా మారుతుంది. ప్రస్తుతం ఈ బస్సులు నష్టాలలో నడుస్తున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కనీసం 60 శాతం మంది అయినా ప్రయాణికులు లేకపోతే బస్సులు నడపడం కష్టంగా ఉంటుందని వారు అంటున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం నుండి శ్రీకాకుళానికి అరగంటకు ఒకసారి ఉన్న నాన్ స్టాప్ బస్సు సర్వీసులను తగ్గించి, 45 నిమిషాలకు ఒక బస్సును నడుపుతున్నారు.
60 శాతం ఆక్యుపెన్సీ లేకపోతే నాన్ స్టాప్ బస్సులు నడపటం కష్టం
నర్సీపట్నం కి, కాకినాడ, రాజమండ్రి కి కూడా గతంతో పోలిస్తే నాన్ స్టాప్ బస్సు సర్వీస్ లను తగ్గించారు. అయినప్పటికీ స్త్రీ శక్తి పథకం ప్రభావం నాన్ స్టాప్ బస్సు సర్వీసుల పైన చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని సర్వీసులను రద్దు చేసి సంస్థకు నష్టం జరగకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్న ఆర్టీసీ అధికారులు కనీసం 60 శాతం ఆక్యుపెన్సీ లేకపోతే వాటిని నడపడం కష్టమని భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బస్సు సర్వీసుల ఆక్యుపెన్సీ ని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications