రాజధాని వస్తుందని దొనకొండలో భూమి కొనుగోలు, కడుపు మంట: రోజాకు గాలి కౌంటర్
హైదరాబాద్: రాజధాని అమరావతి పైన తీవ్ర ఆరోపణలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజాకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం నాడు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన నమ్మకంతోనే సింగపూర్ ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాన్ను ఉచితంగా ఇచ్చిందని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దొనకొండలో రాజధాని వస్తుందని భావించి, అక్కడ పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపించారు.
దొనకొండలో రాజధాని వస్తే తమ భూములకు విలువ పెరుగుతుందని భావించారన్నారు. ఇప్పుడు రాజధాని దొనకొండలో కాకుండా, అమరావతిలో రావడంతో వారు కడుపు మంటతోనే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఖాయమన్నారు. ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం ఇప్పుడు అమలవుతుందన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ భరోసా యాత్ర పైన కూడా గాలి స్పందించారు. వైయస్ హయాంలో 1400 మంది రైతులు చనిపోతే అప్పుడు ఎందుకు భరోసా యాత్ర చేయలేదని ప్రశ్నించారు.