ఏపీలో నిత్యకృత్యంగా గంజాయి దందా .. పాలకొల్లులో భారీగా గంజాయి పట్టివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. ఒక పక్క కరోనా మహమ్మారి రోజు రోజుకూ చాప కింద నీరులా విస్తరిస్తున్నా , రాష్ట్రం యుద్ధం చేస్తున్నా అవేవీ పట్టనట్టు గంజాయి అక్రమ రవాణా యదేచ్చగా జరుగుతుంది . గంజాయి స్మగ్లర్లు ఈ సమయంలో కూడా అక్రమ మార్గాల ద్వారా గంజాయి దందా సాగిస్తున్నారు.
గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నారు. పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిని పట్టుకోవటం నిత్య కృత్యంగా మారింది . తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. కారులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. రూ.21 లక్షల 75వేల విలువైన 435 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు ఒక కారు, రెండు బైక్లు, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరి నుండి వివరాలు రాబడుతున్నారు. వారు ఎక్కడ నుడి గంజాయి తీసుకు వెళ్తున్నారు అలాగే ఎక్కడికి ఈ గంజాయిని తరలిస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాలో ఎంత మంది ఉన్నారు అని దర్యాప్తు చేస్తున్న పోలీసులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.