జగన్పై గంటా నిప్పులు, బాబు చెప్తే ఉపముఖ్యమంత్రిని!
చిత్తూరు/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారని అయినప్పటికీ ఆయన మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మంగళవారం అన్నారు. ఆయన తిరుమల శ్రీవారిని ఉదయం దర్సించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
జగన్ను ప్రజలు తిరస్కరించినా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విజయవాడ లేదా తిరుపతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. చంద్రబాబు ఆదేశిస్తే తాను ఉప ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. లేదంటే సాధారణ కార్యకర్తగా పని చేస్తానని చెప్పారు. ఎవరికి ఏం ఇవ్వాలో చంద్రబాబుకు తెలుసునని చెప్పారు.
ఎన్నికల్లో ఓటర్లు మంచి తీర్పును ఇచ్చారన్నారు. అభివృద్ధి చేయాలనే విజన్ గల నాయకుడికి పట్టం కట్టారని కొనియాడారు. ప్రజల తీర్పును గౌరవించకుండా జగన్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని విమర్శించారు. తనకు పదవి ముఖ్యం కాదని... ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమన్నారు.
కాకా పట్టేందుకే: జెసి
నరేంద్ర మోడీని కాకా పట్టేందుకే వైయస్ జగన్ ఆయనను కలిశారని జెసి దివాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ జగన్ పార్టీకి రఘువీరా రెడ్డి సహకరించారని ఆరోపించారు. విత్ డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చారన్నారు. జగన్ పార్టీ కాంగ్రెస్లో కలిసిపోతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబును ఎన్డీఏ కన్వీనర్గా ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న దానం
శ్రీవేంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయవేత్తలు దర్శించుకున్నారు. వీరిలో భీమిలి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంటా శ్రీనివాస రావు, సత్తెనపల్లి నుంచి గెలిచిన కోడెల శివ ప్రసాద్, తిరుపతి నుంచి ఎన్నికైన వెంకటరమణ ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
వెంకయ్యతో బాబు భేటీ
ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరయేందుకు ఢిల్లీలో ఉన్న చంద్రబాబు... ఈ ఉదయం 10.45 గంటలకు బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడుతో భేటీ అయ్యారు. ఎన్డీయే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వీరు చర్చించారు. అనంతరం అద్వానీతో చంద్రబాబు భేటీ అయ్యారు.