స్పీకర్ కు టీడీపీ ఎమ్మెల్యే గంటా లేఖ - రాజీనామా పై క్లారిటీ : వ్యూహం అదేనా..!!
మాజీ మంత్రి..టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు స్పీకర్ తమ్మినేని సీతారాం కు లేఖ రాసారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన గంటా.. అప్పటి నుంచి పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా.. పార్టీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం యాక్టివ్ గా ఉండటం లేదు. కొద్ది రోజుల క్రితం పార్టీ విశాఖ ఎమ్మెల్యే సమావేశానికి రావాలంటూ టీడీపీ అధినేత నుంచి సమాచారం పంపినా..ఆయన సమావేశానికి హాజరు కాలేదు. దీంతో..ఆయన అసలు పార్టీలో ఉండరనే చర్చ సైతం మొదలైంది. చాలా కాలంగా గంటా పార్టీ మారుతారనే ప్రచారం కొనసాగుతున్నా..ఆయన మాత్రం టీడీపీలోనే ఉంటాననే సంకేతాలు ఇచ్చారు.

గంటా రాజీనామాకే కట్టుబడి ఉన్నానంటూ
ఇక, గత ఏడాది ఫిబ్రవరి 12న గంటా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత కొన్ని విమర్శలు రావటంతో మరోసారి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి ఆ లేఖను అసెంబ్లీకి పంపారు. దీని పైన స్పీకర్ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
కాగా, ఇప్పుడు తాజాగా గంటా నేరుగా స్పీకర్ కు లేఖ రాసారు. తన రాజీనామా ఆమోదించాలని అందులో కోరారు. తాను ఇష్టపూర్వకంగానే రాజీనామా చేసానని అందులో పేర్కొన్నారు. కొద్ది రోజులుగా గంటా టీడీపీ రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కాపు నేతల సమావేశాలకు హాజరు అవుతున్నారు. హైదరాబాద్... విశాఖల్లో జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.

రాజీనామా ఆమోదం కోరుతూ లేఖ
విశాఖ జిల్లాలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనూ వంగవీటి రాధాతో కలిసి హాజరయ్యారు. కాపు నేతలు ఫోరం ఫర్ బెటర్ ఏపీ అనే సంస్థను ప్రారంభించారు. ఇక, ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణలో భాగంగా.. ప్లాంట్ ఆస్తుల మదింపు కోసం కేంద్రం తాజా బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. దీంతో.. కార్మికులు మరోసారి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. వారికి మద్దతుగా నిలుస్తానని గంటా స్పష్టం చేసారు. అయితే, గంటా రాజకీయ అడుగులు అంతు చిక్కటం లేదు. టీడీపీలోనే ఉంటున్నా.. పార్టీ సమావేశాలకు రావటం లేదు. అయితే, తన రాజీనామా ఆమోదించాలని కోరటం ద్వారా ..ఆయన వ్యూహం ఏంటనే దాని పైన ఇప్పుడు చర్చ మొదలైంది.
Recommended Video

టీడీపీ నుంచి బయటకు వస్తారా..లేక
స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా రాజీనామా చేస్తే ఎవరూ పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా వారు తిరిగి గెలిచేలా బాధ్యత తీసుకోవాలని అప్పట్లో చర్చ సాగింది. అయితే, గంటా మాత్రం తాన రాజీనామా ఆమోదిస్తే తిరిగి పోటీ చేసే అంశం పైన మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. అయితే, గంటా టీడీపీ వీడి.. వచ్చే ఎన్నికల్లొ మరో పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ఎన్నికల సమయానికి ఉన్న పరిస్థితుల అనుగుణంగా నిర్ణయం తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి ముందుగానే స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా చేసిన రాజీనామా ఆమోదించుకోవటం ద్వారా..వ్యక్తిగతంగా మైలేజ్ దక్కించుకొనే వ్యూహం అమలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కానీ, ఇప్పుడు గంటా రాజీనామా పైన నిర్ణయం స్పీకర్ తీసకోవాల్సి ఉంది. అన్ని కోణాల్లొ పరిశీలన చేసిన తరువాతనే స్పీకర్ దీని పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications