ఉచిత పథకాలపై ప్రవచనకర్త గరికపాటి సంచలన వ్యాఖ్యలు!!
ఏ రాష్ట్రంలో చూసినా అధికారంలోకి రావడం కోసం రాజకీయ పార్టీలు ప్రజలకు తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత పథకాలను అందిస్తామని ప్రజలకు చెబుతూ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అన్ని వర్గాల వారి సంక్షేమమే తమ ధ్యేయం అని, అన్ని వర్గాల సంక్షేమం కోసం తాము అనేక ఉచిత పథకాలను తీసుకొస్తున్నామని చెబుతున్నాయి.
ఇక రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలకు ఉబ్బి తబ్బిబ్బవుతున్న ప్రజలు ఎన్నికల్లో ఆయా పార్టీలకు పట్టం కడుతున్నారు. అయితే వెనక ముందు చూసుకోకుండా రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు, ఆయా రాష్ట్రాలకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి, రాష్ట్రాన్ని దివాలా తీసే స్థాయికి తీసుకు వెళ్తున్నాయి అనేది అందరూ అంగీకరించాల్సిన విషయం.

ప్రజలలో కష్టపడి పనిచేసే స్వభావాన్ని పెంచడం, వారికి కావలసిన ఉపాధి అవకాశాలు కల్పించడం, తద్వారా వారి జీవన ఆర్థిక స్థితిగతులు మెరుగుదలకు సహాయపడటం చేయవలసిన ప్రభుత్వాలు, అలా కాకుండా తాము ప్రకటించిన ఉచిత పథకాలతో మరింత సోమరిపోతులుగా తయారు చేస్తున్నాయి. తాము ప్రకటించిన పథకాలను అమలు చేయడం కోసం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఉచిత పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత పథకాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉచిత పథకాలతో ప్రజల తలరాతలు మారవని, వీటితో ప్రభుత్వాలు కూడా బాగుపడవని గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు.
తక్కెళ్ళపాడు లో నిన్న నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఉచితాలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి అని వాటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజలు చైతన్యంతో ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నికల సమయంలో మంచి వ్యక్తికి ఓటు వేయాలని సూచించారు.ఇక విదేశాలలో ఉన్న వారు అక్కడ డబ్బులు సంపాదించిన తర్వాత స్వదేశాలకు వచ్చి స్థిరపడి తల్లిదండ్రులకు సేవ చేయాలని గరికపాటి నరసింహారావు ఆకాంక్షించారు. ఆయన తన ప్రవచనాలతో పాటు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications