TTD: గరుడ వాహన సేవ, గోవింద గోవిందా, లక్ష్లలాది మంది భక్తులు
తిరుమలలో బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన గరుడ వాహన సేవ మంగళవారం రాత్రి ఘనంగా జరుగుతోంది. సుమారు 3 లక్షల మందికి పైగా భక్తుల సాక్షిగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులకు అభయమిస్తూ శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమల చేరుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం, దేవదేవుడు ఆయనకు ఇష్టమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తుంటే భక్తులు చూసి తరించిపోయారు. వెంకటగిరులు గోవింద నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న స్వామి వారు అడుగడుగునా భక్తును ఆశీర్వదిస్తున్నారు. గరుడవాహన సేవలో మూల విరాట్ ను ప్రత్యేకంగా అలంకరించారు.

మకరకంఠి, లక్ష్మీ హారం, శ్రీ వెంకటేశ్వర సహస్రనామలతో పాటు ఎవ్వరూ వెలకట్టలేని ఆభరణాలతో స్వామివారిని అలంకరించారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన గరుత్మంతుడిపై తిరువీధుల్లో విహరిస్తూ స్వామివారు సంతోషిస్తారని, ఆ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని కోట్లాదిమంది శ్రీవారి భక్తుల నమ్మకం.
గరుడ వాహన సేవను దర్శించుకుంటే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాలు ఏ రోజు లేనంత రద్దీ గరుడ వాహన సేవ రోజు మాత్రం ఉంటుంది. తిరుమలలో గరుడ వాహన సేవ రోజు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు మూడు లక్షల 50 వేల మంది తిరుమల చేరుకుని ఉంటారని టీటీడీ అధికారులు ముందుగానే అంచనా వేశారు.
అయితే అంతకంటే ఎక్కువే శ్రీవారి భక్తులు తిరుమలలో ఉన్నారని సమాచారం. ఏడుకొండలస్వామి కొలువుతీరిన తిరుమలలో గోవింద నామస్మరణలతో ఆ ప్రాంతం మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా గోవిందా గోవిందా అంటూ భక్తులు పరవసించిపోతున్నారు. తమకు ఎంతో ఇష్టమైన ఏడుకొండల శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షలాదిమంది భక్తులు తిరుమలలో వేచి చూస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహన సేవ రంగరంగ వైభవంగా జరుగుతోంది.












Click it and Unblock the Notifications