లోకేష్ మంత్రి పదవి సరే కానీ, రాత్రికి రాత్రే చంద్రబాబు వైఖరి మారింది: ఈశ్వరి
విశాఖ: ఏపీకి ప్రత్యేక హోదా సాధించగలిగేది తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అరకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. కావాల్సింది లోకేష్కు మంత్రి హోదా కాదని, ఏపీకి ప్రత్యేక హోదా అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వైసిపి నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభలో ఈశ్వరి ప్రసంగించారు. ప్రత్యేక హోదా పైన చంద్రబాబు, వెంకయ్యల కుట్రలను బహిర్గతం చేసేందుకేనని అన్నారు. తద్వారా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో మార్మోగుతుందని అరకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఏపీకి ప్యాకేజీ ఇస్తామన్న జైట్లీ ప్రకటనను చంద్రబాబు అర్ధరాత్రి స్వాగతించాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, వెంకయ్య ఆ రోజు ఏపీకి ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇవ్వాలని పట్టుబట్టారన్నారు.
ఇప్పుడు హోదా కాదు, ప్యాకేజీ చాలు అని చెప్పడం విడ్డూరమన్నారు. హోదా విషయంలో రాత్రికి రాత్రే చంద్రబాబు తన వైఖరి మార్చుకున్నారన్నారు. తనకు, తన కొడుకుకు దోచుకోవడం అనువుగా ఉంటుందనే ప్యాకేజీని స్వాగతించారని ఆరోపించారు.
ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. ఆయన ఓ అబద్దాల పుట్ట అన్నారు. చంద్రబాబు, వెంకయ్య కలిసి కుల రాజకీయాలు మాట్లాడుకోవడం తప్ప ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి పట్టించుకోవడం లేదన్నారు.
హోదా ఉద్యమంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు చేస్తున్న నేత జగన్ అని, ఆయనకు ప్రజలు అండగా ఉండాలన్నారు. కావాల్సింది లోకేష్కు మంత్రి హోదా కాదని, ఏపీకి ప్రత్యేక హోదా అన్నారు. హోదా ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. హోదా పోరులో ఇది ఆరంభం మాత్రమే అన్నారు.












Click it and Unblock the Notifications