ఏపీ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ - చక్రం తిప్పిన కేవీపీ : కిరణ్ కుమార్ రెడ్డికి జలక్..!!
ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు నియమితులయ్యారు. ఆయనతో పాటుగా జంబో టీంను ఏర్పాటు చేసారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో నామమాత్రంగా మారిన కాంగ్రెస్ కు ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న శైలజానాధ్ స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటుగా పలు కమిటీలను ఏర్పాటు చేసారు. ఈ కూర్పు మొత్తంలో పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు మార్క్ కనిపిస్తోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నామమాత్రపు పదవికి పరిమితం చేసారు. అదే విధంగా పార్టీకి దూరంగా ఉంటున్న రఘువీరాకు బాధ్యతలు కేటాయించారు. ఈ జాబితాలో చిరంజీవి ప్రస్తావన లేదు.
కేవీపీ మార్క్ రాజకీయం అంటూ
ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ను నియమిస్తూ పార్టీ అధినేత మల్లిఖార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో పాటుగా అధినాయకత్వంతో సత్సంబంధాలు కలిగిన రుద్రరాజుకు ఏపీ బాధ్యతలను కేటాయించారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి నామమాత్రంగా మారింది. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది.
2014, 2019 ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలుచుకోలేదు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మారటంతో..ఏపీలోని అధ్యక్షుడి మార్పు జరిగింది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంలో రుద్రరాజుకు పగ్గాలు సవాల్ గా మారుతున్నాయి. ఇక, అధ్యక్షుడితో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి.రాజేష్ రెడ్డిలను నియమించారు.
పల్లంరాజు - హర్షకుమార్ కు ప్రాధాన్యత
ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా పల్లంరాజు నియమితులయ్యారు. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా హర్షకుమార్ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా తులసిరెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకాల వెనుక పార్టీ నేత కేవీపీ రామచంద్రరావు ముద్ర ఉందని కాంగ్రెస్ నేతల మధ్య చర్చ మొదలైంది. రుద్రరాజు సైతం కేవీపీకి సన్నిహితంగా ఉంటారు. రఘువీరా పార్టీ బాధ్యతలు వద్దని చెప్పటం..శైలజానాధ్ ను మార్చాలని నిర్ణయించటంతో రుద్రరాజు పేరు తెర పైకి వచ్చింది.
పార్టీకి పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించారు. అందులో సీనియర్లు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఊమెన్ చాందీ, మెయ్యప్పన్, క్రిస్టొఫర్ తిలక్, గిడుగు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, పళ్లం రాజు, చింతామోహన్, సుబ్బరామిరెడ్డి, జేడీశీలం, జీవీ హర్షకుమార్, కనుమూరి బాపిరాజు, తులసిరెడ్డి, కొప్పుల రాజు, మస్తాన్ వలి, సిరివెళ్ల ప్రసాద్, ఉషా నాయుడు ఉన్నారు.
కిరణ్ కు దక్కని ప్రాధాన్యత.. పార్టీలో కొనసాగేనా
ఇక, 33 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. కో ఆర్డినేషన్ కమిటీలో అనుబంధ సంఘాల అధ్యక్షులకు చోటు కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ కో ఆర్డి నేషన్ కమిటీలో అవకాశం ఇచ్చారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీఎం పదవికి..పార్టీకి రాజీనామా చేసిన కిరణ్..ఆ తరువాతి కాలంలో తిరిగి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలో కొద్ది రోజులు హడావుడి చేసినా..ఆ తరువాత కామ్ అయిపోయారు. ఆయన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధినాయకత్వం కిరణ్ కు ప్రాధాన్యత లేని పోస్టులో నియమించింది. మరి..కిరణ్ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.