బాలికపై రెండు సార్లు రేప్: నిందితుడ్ని వదిలేయాలని గ్రామపెద్దలు
కాకినాడ: పిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు రెండుసార్లు అత్యాచారం చేశాడు. ఈ సంఘటనపై గ్రామ పెద్దలు చెప్పిన తీర్పు మరింత సిగ్గు పడేలా ఉంది. బాధితురాలి తల్లిదండ్రులు నిందితుడిని గ్రామపెద్దలు రక్షించడానికి చేసిన ప్రయత్నం పట్ల తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
మొదటి తప్పుగా భావించి నిందితుడిని క్షమించి వదిలేయాలని గ్రామ పెద్దలు బాధితురాలి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తూర్పు గోదావరి జిల్లా సీతానంగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన పత్తిపాటి శ్రీను (30) అదే గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
తల్లిదండ్రులు వ్యవసాయ కూలీకి వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలికను మభ్యపెట్టి ఈ నెల 7వ తేదీన శ్రీను బాలికపై రెండు సార్లు అత్యాచారం చేశాడు. విషయాన్ని బయటకు చెప్పకుండా కొంత మంది అడ్డుకున్నారని బాధితురాలు చెబుతోంది.
ఇదిలావుంటే, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని కాపవరంలో సత్యంశెట్టి ఆదినారాయణ (58) ఓ మూగబాలిక (15)పై అత్యాచారం చేసినట్టు ఎస్ఐ పి దొరరాజు తెలిపారు. ఈ నెల ఏడోతేదీ అర్ధరాత్రి ఆ బాలిక ఒంటరిగా నిద్రిస్తున్నపుడు ఇంట్లో చొరబడిన ఆదినారాయణ బాలికపై అత్యాచారంచేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.