ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంలో సవాల్ చేసిన జగన్ ప్రభుత్వం..!!
అమరావతి: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 1పై చెలరేగిన రాజకీయ దుమారం ఇంకా తగ్గట్లేదు. ఈ జీఓను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసినప్పటికీ- దీనిపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ జీఓను విడుదల చేయడానికి గల కారణాలను అటు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరిస్తోన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు లెక్క చేయట్లేదు. జీఓను జారీ చేయడాన్ని తప్పుపడుతూనే ఉన్నారు. కాపీలను భోగి మంటల్లో వేసి తగులబెట్టి- తమ నిరసన సైతం తెలియజేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా..: కార్యవర్గ సమావేశాల్లో ఖరార్..!!
తెలుగుదేశం పార్టీకి చెందిన ఉరవకొండ శాసన సభ్యుడు పయ్యావుల కేశవ్ ఈ జీఓపై విమర్శలు సంధించారు. దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీఓను తప్పుపట్టారు. ఢిల్లీ నడిబొడ్డున స్వయానా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఎలాంటి ఆంక్షలు లేకుండా రోడ్ షో నిర్వహించగలిగారని, ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. నగరాల్లో కాదు కదా.. కనీసం మారుమూల గ్రామాల్లో కూడా రోడ్ షో చేసే స్వేచ్ఛను కోల్పోయామని ఆయన విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు- నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో నిర్వహించిన రోడ్ షో, బహిరంగ సభల్లో సంభవించిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో- అలాంటి సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన జీఓ ఇది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఏపీ హైకోర్టు ధర్మాసనం వాటికి అనుకూలంగా మధ్యంతర తీర్పు వెలువడించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఈ జీఓను సస్పెండ్ చేసింది.
ఈ పరిణామాల మధ్య జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్ కు వెళ్లింది. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టులో పిటీషన్ ను దాఖలు చేసింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం అందింది. సుప్రీీంకోర్టు ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది.