చిరంజీవికి భిన్నంగా, పవన్కళ్యాణ్ని మెచ్చుకుంటున్నారు: ఫ్యాన్స్ జోరు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం జరిగిన దారుణ దుర్ఘటన పైన మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్లు విభిన్నంగా స్పందించారు. చిరు కాంగ్రెస్ పార్టీలో ఉండగా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపిలకు మద్దతిచ్చారు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం చిరంజీవి క్రియాశీలక రాజకీయాల్లో ఎక్కువగా కనిపించలేదు. అడపాదడపా కనిపించారు. పవన్ కళ్యాణ్ సైతం ఒకటి రెండుసార్లు బయటకు వచ్చారు. సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో మాత్రం నిలదీస్తున్నారు.
ఏడాది కాలంలో చిరంజీవి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు అరుదుగా ఉన్నాయి. రాజమండ్రి విషయంలో మాత్రం ఘాటుగా స్పందించారు. చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ తెరపైకి తెచ్చారు.
పవన్ కళ్యాణ్ రాజధాని కోసం ప్రభుత్వం బలవంతంగా భూములు వసూలు చేస్తోందన్న దాని పైన చంద్రబాబుకు హెచ్చరికలు పంపించారు. గత కొద్ది రోజులుగా ప్రత్యేక హోదా పైన ప్రభుత్వ, విపక్షాలను నిలదీస్తున్నారు.
రాజధాని ఘటన పైన వీరిద్దరు స్పందన మాత్రం భిన్నంగా ఉంది. చంద్రబాబు రాజీనామా చేయాలని, ఆయనే బాధ్యత వహించాలని చిరంజీవి డిమాండ్ చేయగా, పవన్ కళ్యాణ్ తాజా పరిస్థితికి అనుగుణంగా మాట్లాడారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజా పరిస్థితి రాజకీయాలు చేసేందుకు కాదని, అందుకే పవన్ పరిణితితో ఆలోచించి స్పందించారని అంటున్నారు.
అంతేకాదు, తాము రాజమండ్రి వెళ్లి చూస్తామని చిరంజీవి, కాంగ్రెస్ నేతలు చెప్పగా, తాను వస్తే తొక్కిసలాటకు ఆస్కారం ఉంటుందనే తాను రావడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా, చిరు, పవన్ భిన్న స్పందనలపై నెట్లో అభిమానులు జోరుగా స్పందిస్తున్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ను చూసి నేర్చుకోవాలని టిడిపి నేతలు హితవు పలకడం గమనార్హం.