గుంటూరు జిల్లాలో భారీ చోరి;కిలోన్నర బంగారం,25 కిలోల వెండి అపహరణ...సంచలనం
గుంటూరు జిల్లా : ఎపి రాజధాని అమరావతికి అతి సమీపంలో జరిగిన ఓ భారీ దొంగతనం సంచలనం సృష్టిస్తోంది. ఈ దోపిడీ ఘటనలో దొంగలు సుమారు 50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది.
గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం...అచ్చంపేట మెయిన్ బజారులో ఎస్కే మస్తాన్వలికి చెందిన అలీ జ్యూయలర్స్ షాపులో గురువారం అర్ధరాత్రి తర్వాత దొంగతనం జరిగింది. దొంగలు దుకాణం వెనుక నుంచి తలుపులు తీసుకుని లోపలికి ప్రవేశించి షాపులోని బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకుపోయారు. శుక్రవారం ఉదయం షాపు తెరవగానే సీసీ కెమెరాలు పగులగొట్టి ఉండటంతో షాపులో దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దొంగలు జ్యూయలరీ షాపులో కిలోన్నర బరువు తూగే బంగారు ఆభరణాలు, 25 కిలోల వెండి అపహరించుకు పోయినట్లు షాపు యజమానులు చెబుతున్నారు. వీటి విలువ రూ. 50 లక్షలకు వరకు ఉండొచ్చని అంటున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్టీంను, డాగ్స్క్వాడ్ను రంగంలోకి దించారు. పోలీసు జాగిలం జ్యూయలరీ షాపు నుంచి బయటకు వచ్చి అచ్చంపేటలోని పెదపాలెం అడ్డరోడ్డు వరకు వెళ్లి అక్కడ ఆగింది. క్లూస్టీం సభ్యులు ఆధారాలను సేకరించారు. ఈ కేసును సవాలుగా తీసుకుని దోషులను పట్టుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. అచ్చంపేట ఎస్ఐ కిరణ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంగారు, వజ్రాల వ్యాపారులను టార్గెట్ చేసుకొని అచ్చంపేటలో వరుస దోపిడీలు చేస్తుండటం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. డిసెంబర్ 23 న ఇలాగే ఓ వజ్రాల వ్యాపారి దగ్గర డైమండ్ కొనడానికి అని వచ్చిన కొందరు యువకులు హఠాత్తుగా లాక్కొని పోయిన ఘటన జరిగి నెల రోజులు కూడా కాక ముందే మళ్లీ అచ్చంపేటలో మరో భారీ దొంగతనం జరగడం చర్చనీయాంశం అయింది.












Click it and Unblock the Notifications