ఆరోజు నుంచే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాయి. వాటిబాటలోనే అడుగులు వేసేందుకు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది.
రేవంత్రెడ్డి విధానాలనే అనుసరించాలని..
తెలంగానలో రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం విధివిధానాలను అమలు చేసి ఒక నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనికోసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అతి త్వరలోనే ఈ కమిటీ నివేదికను సమర్పించనుంది. రేవంత్ రెడ్డి సర్కారు అనుసరిస్తున్న విధానాన్నే ఏపీలో కూడా అనుసరించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. జులై 1 నుంచి రాష్ట్రంలో అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై రెండురోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఆటోడ్రైవర్లకు ఇబ్బంది లేకుండా..
తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రకటించగానే ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని అమలు చేయడంవల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన చేశారు. తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వారితో సమావేశమై కష్టనష్టాలు తెలుసుకొని వారికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఏపీలో ఆటోడ్రైవర్లకు ఇబ్బంది లేకుండా దీన్ని అమలు చేయాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాంప్రసాద్ రెడ్డి కూడా అధికారులు అతి త్వరలోనే నివేదికను అందివ్వనున్నారని, తర్వాత దీని అమలుపై కసరత్తు ప్రారంభమవుతుందన్నారు. చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకువచ్చేలా తాము పనిచేయమని, ఆయనకు మంచిపేరు తెచ్చేలా పనిచేస్తామని మంత్రి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications